Chittoor : తల్లిదండ్రులు తమ పిల్లలకు కష్టం తెలియకుండా చదివిస్తారు. కానీ విద్యార్థులు చిన్న చిన్న విషయాలకు మనస్తాపానికి గురై ఆత్యహత్యలు చేసుకుంటున్నారు.ఇలాంటి ఘటనే చిత్తూరు జిల్లా పలమనేరులో చోటుచేసుకుంది. మహిళా పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్లో ఓ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
శ్రీరంగరాజపురం మండలానికి చెందిన రసజ్ఞ (16) పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. గురువారం ఉదయం తోటి విద్యార్థులు కళాశాలకు వెళ్లగా హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన సిబ్బంది హుటాహుటిన పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రసజ్ఞ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఘటన స్థలానికి చేరుకున్న డీఎస్పీ సుధాకర్ రెడ్డి పరిస్థితిని సమీక్షించారు. పాలిటెక్నిక్ కళాశాలలో రసజ్ఞ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందన్న సమాచారంతో ఘటనా ప్రాంతానికి చేరుకుని విచారణ చేపట్టామని సీఐ చంద్రశేఖర్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామన్నారు. దర్యాప్తు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.