Qassem Soleimani : దివంగత జనరల్కు తుది వీడ్కోలు పలికేందుకు జనం కెరటంలా తరలిరావడం ఎప్పుడైనా చూశారా? ఆ అభిమానం ఎంత అంటే.. తొక్కిసలాట జరిగేంతగా.. ఆ తొక్కిసలాటలో 56 మంది మరణించేటంతగా! చనిపోయి నాలుగేళ్లయినా ఇరానియన్ల హృదయాల్లో చెక్కుచెదరని నేతగా నిలిచారంటే సాదాసీదా విషయం కాదుగా. ఇంతకీ ఆ నేత ఎవరంటారా? ఇరాన్ జనరల్ ఖాసిం సులేమానీ. ఆయన నాలుగో వర్ధంతి సందర్భంగా కెర్మన్లో జరిగిన జంట పేలుళ్లలో వందమందికి పైగా బలైన సంగతి తెలిసిందే.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం దరిమిలా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఈ ఉగ్రదాడి జరిగింది. ఇజ్రాయెల్పై అక్టోబర్ 7న హమాస్ జరిపిన మెరుపుదాడిని..సులేమానీ హత్యకు ప్రతీకారమేనంటూ ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది. అయితే దానిని హమాస్ ఖండించింది. హమాసతో పాటు లెబనాన్కు చెందిన హెజ్బొల్లా, యెమెన్ కు చెందిన హౌతీ రెబల్స్కు ఇరాన్ మద్దతుగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో సులేమానీ వర్ధంతి సభను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగడం దిగ్ర్భమ గొల్పుతోంది. పశ్చిమాసియాలో ఇరాన్ సైనిక కార్యకలాపాల్లో సులేమానీ కీలకసూత్రధారి. జాతీయ దిగ్గజ నేతగా ఆయనకు పేరుంది.
సులేమానీ జీవితం తొలినాళ్లు కొంత మిస్టరీయే. మార్చి 11, 1957లో రేబట్ పట్టణంలో జన్మించారు. ఆయన చిన్నతనం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఆయన తండ్రి ఓ రైతు. 1979లో ఇస్లామిక్ విప్లవం వచ్చిన సమయంలో సులేమానీ వయసు 13 ఏళ్లు. అప్పుడే ఆయన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్లో చేరారు. ఇరాన్పై ఇరాక్ దండెత్తిన దరిమిలా 8 ఏళ్లు సుదీర్ఘంగా సాగిన యుద్ధానికి సులేమానీ ప్రత్యక్ష సాక్షి. ఇరాకీ బలగాలు సులేమానీ యూనిట్పై రసాయన ఆయుధాలతో విరుచుకుపడింది కూడా. ఆ యుద్ధం తర్వాత కొంత కాలం మరుగునపడిపోయారు.
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ విదేశీ ఆపరేషన్ల విభాగమైన ఖుద్స్ ఫోర్స్ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తిరిగి వార్తల్లోకి వచ్చారు. అదే సమయంలో ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీకి దగ్గిరయ్యారు. ఖుద్స్ఫోర్స్(జెరూసలేం ఫోర్స్) చీఫ్గా సులేమానీ.. పశ్చిమాసియా అంతటా సైనిక చర్యలను పర్యవేక్షించారు. 2003లో ఇరాక్పై అమెరికా దాడి చేసేంత వరకు సులేమానీ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఆ యుద్ధంలో ఇరాక్లోని కొన్ని గ్రూపులకు ఆయన సాయం చేశాడు. ఇది అమెరికాకు కంటగింపైంది.
సిరియా, ఇరాక్, యెమెన్లలో ఇరాన్ రాజకీయ, సైనిక ఎజెండాను నిర్దేశించడమే కాకుండా, పశ్చిమాసియా ప్రాంతంలో ఇరాన్ను ఓ ప్రబలశక్తిగా నిలపడంలో సులేమానీ పాత్ర తక్కువేం లేదు. దాంతో అమెరికా, దాని మిత్రదేశాలకు ప్రాణాంతక శత్రువుయ్యాడాయన. ఈ కారణంగానే అడ్డుతొలగించుకోవాలని అమెరికా, మిత్రదేశాలు భావించాయి. ఇందుకు మెరికా అధ్యక్షుడు ట్రంప్ సమ్మతి తెలిపారు. జనవరి 3, 2020న బాగ్దాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి ఇతరులతో కలిసి వెళ్తున్న సులేమానీపై అమెరికా డ్రోన్ దాడి జరిపింది.
అంతకుముందు 2006లో ఇరాన్లో విమాన ప్రమాదం, 2012లో డమాస్కస్లో బాంబుల దాడి నుంచి సులేమానీ బయటపడగలిగినా.. మూడోసారి మాత్రం మృత్యుకౌగిలి నుంచి తప్పించుకోలేకపోయారు. అప్పటికి సులేమానీ వయసు 62 ఏళ్లు. ‘మరణం ముగింపు కాదు.. దానితోనే జీవితం ఆరంభం’ అన్నది సులేమానీ నేర్చుకున్నామని ఓ కమాండర్ చెప్పారు. అందుకేనేమో.. మరణించి నాలుగేళ్లయినా ప్రజల్లో సులేమానీకి చెక్కుచెదరని ఆదరణాభిమానాలు.