Sabarimala: కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయానికి అయ్యప్ప భక్తుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. అనూహ్యంగా ఏర్పడిన రద్దీ దృష్ట్యా.. ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అప్రమత్తమైంది. మకరజ్యోతి దర్శనానికి భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 10వ తేదీ నుంచి స్పాట్ బుకింగ్స్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మకరజ్యోతి దర్శనానికి భక్తులు భారీగా వస్తారని అందుకే స్పాట్ బుకింగ్స్ ను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ముఖ్యంగా మకరజ్యోతి దర్శనానికి మహిళలు, చిన్నపిల్లలు రావొద్దని సూచించింది.
జనవరి 14వ తేదీన 40 వేల మందికి మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. 15న మకర సంక్రాంతి రోజున కేవలం 50 వంల మందికి మాత్రమే బుకింగ్ లు పరిమితం చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 16వ తేదీ నుంచి 20 వరకూ అనేక మంది భక్తులకు దర్శనానికి, వసతికి ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది. ఈ రోజు అయ్యప్పను దర్శించుకునేందుకు శబరిమల ఆలయానికి భక్తులు పోటేత్తారు. స్వామి దర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. నవంబర్ 17 నుంచి డిసెంబర్ 27 వరకు 32 లక్షల మంది భక్తులు స్వామిని దర్శించుకోగా.. రూ.241 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది.