వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరడంపై వైసీపీ పెద్దలు స్పందించారు. ఈ వ్యవహారంపై మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ కాళ్లు తాము నరుక్కోమన్న ఆయన.. జగన్కు వ్యతిరేకంగా ఎవరు పని చేసినా వారిని ప్రత్యర్థులుగానే చూస్తామని స్పష్టంచేశారు. ఎవరొచ్చినా జగనే తమ నాయకుడని తెలిపారు. ఇటీవల జగన్ చేసిన కుటుంబ వ్యాఖ్యలపై కూడా మాట్లాడిన పెద్దిరెడ్డి.. సోనియా, చంద్రబాబులు కుటుంబాలనే కాదు.. మనుషుల్ని చీల్చే రాజకీయం చేసే నైజం ఉన్న వ్యక్తులని మండిపడ్డారు.
ఢిల్లీ పెద్దల సమక్షంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరారు. ఈ సమయంలో సీఎం జగన్ తన కుటుంబాన్ని చీలుస్తారంటూ చేసిన వ్యాఖ్యలపై షర్మిలను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. తనకు ఆ విషయాలేవి తెలియవన్నారు ఆ వ్యాఖ్యలేవి తనకు అర్థంకావడంలేదని జవాబిచ్చారు. ఇక కాంగ్రెస్ ఏ బాధ్యతలు అప్పగించినా చేస్తానని.. దేశంలోనే రాజన్న రాజ్యం రావాలని ఆమె ఆకాంక్షించారు.