Habsiguda Crime news(Hyderabad latest news):
హైదరాబాద్ హబ్సీగూడలోని రవీంద్రనగర్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు స్కూల్ బస్సు కిందపడి రెండేళ్ల చిన్నారి మృతి చెంచింది. తండ్రి, అమ్మమ్మతో కలిసి తన అన్నను స్కూల్ బస్ ఎక్కించేందుకు చిన్నారి జావ్లానా రోడ్డుమీదికి వచ్చింది. కొడుకును బస్సు ఎక్కించిన తండ్రి.. డ్రైవర్ తో మాట్లాడుతుండగా నేను నాన్న దగ్గరికి వెళ్తానంటూ.. అమ్మమ్మతో ఉన్న చిన్నారి పరుగులు తీసింది.
అదే సమయంలో డ్రైవర్ బస్సును స్టార్ట్ చేసి.. ముందుకి కదిలాడు. చిన్నారి జావ్లానా బస్సు టైర్ కిందపడి మృతి చెందింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే తమ పాప మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న ఓయూ పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారరు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంతో ముద్దుగా ఉండే తమ పాప.. ఇక కళ్లముందు కనిపించదంటూ ఆ తల్లి పెట్టే శోకాలు స్థానికులచే కంటతడి పెట్టించాయి. కాగా.. నెలరోజుల వ్యవధిలోనే స్కూల్ బస్సు కింద పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. డ్రైవర్ల నిర్లక్ష్యం ఖరీదు.. చిన్నారుల నిండు ప్రాణాలవుతున్నాయి.