చంద్రబాబు 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సమయంలో మనస్థాపం చెందిన కొందరు టీడీపీ కార్యకర్తలు , అభిమానులు చనిపోయారు. బాధిత కుటుంబాలను టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పరామర్శించి వారికి భరోసా ఇస్తున్నారు. ఆర్థిక చేయూత కూడా ఇస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా జి. సిగాడం మండలం దవళపేటకు చెందిన టీడీపీ కార్యకర్త కంచరాస అసిరి నాయుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన కుటుంబాన్ని తాజాగా భువనేశ్వరి ఓదార్చారు. మృతుడి భార్య అరుణ కుమారికి రూ. 3 లక్షల చెక్కును అందజేశారు. పార్టీ తరపున కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. భువనేశ్వరి చేసిన యాత్రలో మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, ఎమ్మెల్సీ అనురాధ, నేతలు కిమిడి నాగార్జున, రాంమల్లిక్ నాయుడు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలో కూడా నారా భువనేశ్వరి పర్యటించారు. భామిని మండలం బిల్లుమడ గ్రామంలో చంద్రబాబు అరెస్ట్ తట్టుకోలేక ఇటీవలే పార్టీ కార్యకర్త విశ్వనాథం మృతి చెందాడు. విశ్వనాథం కుటుంబ సభ్యులను నారా భువనేశ్వరి పరామర్శించారు. విశ్వనాథ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పార్టీ తరుపున ఆమె బాధిత కుటుంబానికి రూ.3 లక్షల చెక్కును అందజేశారు.
నారా భువనేశ్వరి అక్టోబర్ నెలలోనే నిజం గెలవాలి పేరిట యాత్రను చేపట్టారు. నారావారిపల్లెలో తండ్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన తర్వాత నారా భువనేశ్వరి యాత్ర ప్రారంభించారు. భువనేశ్వరి విజయనగరం జిల్లాలో నిజం గెలవాలి యాత్ర కొనసాగుతున్న సమయంలోనే చంద్రబాబుకు బెయిల్ రావడంతో యాత్రను నిలిపివేశారు. మళ్లీ బుధవారం యాత్రను పున: ప్రారంభించారు.