Mohammed Siraj : సౌతాఫ్రికా గడ్డపై జరుగుతున్న రెండో టెస్ట్ లో మహ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 15 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన సిరాజ్ ను కొందరు అడిగారు. ఒకేరోజు ఇలా రెండు ఇన్నింగ్స్ లో బౌలింగ్ కి వస్తారని ఏమైనా ఊహించారా? అని అడిగారు.
అస్సలు అనుకోలేదు. నిజంగా ఒకే రోజు రెండు ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేయడం గొప్ప విషయమే. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే, టీమ్ ఇండియా ఒక అడుగు ముందే ఉంది. రెండోరోజు సౌతాఫ్రికాను ఎంత త్వరగా ఆలౌట్ చేయవచ్చుననే అంశంపైనే అంతా ఆధారపడి ఉందని అన్నాడు. అంతేకాదు వారికి మరీ ఎక్కువ లీడ్ వచ్చేలా చూడకూడదని అన్నాడు. ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేనని అన్నాడు.
కొత్త సంవత్సరం ఇలా ఆరు వికెట్లతో ప్రారంభం కావడం పట్ల సంతోషంగా ఉన్నా…ఏడాది పొడవునా ఈ స్ఫూర్తి కొనసాగుతుందని, అంతేకాదు ఇదెంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని అన్నాడు. అప్పుడప్పుడు మన శక్తి మనకు తెలిస్తే, మనపైన మనకెంతో నమ్మకం ఏర్పడుతుంది. పాజిటివ్ గా ఆలోచిస్తామని తెలిపాడు. ఏదైనాత మనం చేయగలం…ఎందుకు చేయలేమనే భావన ముందుకు నడిపిస్తుందని తెలిపాడు.
ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో ఏం చేయలేకపోయానో, ఇప్పుడది చేసి చూపించానని అన్నాడు. ఒకే తరహా బంతులు వేయడానికి ప్రయత్నించాను. అవి అలాగే పడటంతో వికెట్లు వాటంతటవే వచ్చాయని అన్నాడు. ఫస్ట్ వికెట్ పడగానే అదే తరహా బంతులను సంధించాలని అనుకొని, అదే లైన్ అండ్ లెంగ్త్ మీద బౌలింగ్ చేశానని తెలిపాడు.
ఆ లైన్ దొరకడం, ఆ పట్టు చిక్కడం నాకెంతో సంతోషంగా ఉందని తెలిపాడు. సెంచూరియన్ మాదిరిగానే కేప్ టౌన్ కూడా పేస్ బౌలింగ్ కి అనుకూలంగా ఉందని తెలిపాడు. అంతేకాదు మా పేసర్ల ధ్వయం కూడా కలవడంతో పని తేలికైందని సహచరులను మెచ్చుకున్నాడు.
ఇంకా మాట్లాడుతూ బూమ్రాతో కలిసి మెయిడిన్లు వేశాం. దీంతో ప్రత్యర్థులపై ఒత్తిడి పెరిగింది. పరుగులు చేయాలనే తొందరలో వారు వికెట్లు పారేసుకున్నారని తెలిపాడు. ఫోర్లు కొడుతున్నారని, బాల్స్ ని మారిస్తే అయోమయంలో పడతామని తెలిపాడు. వికెట్లు పడుతున్నప్పుడు, ఒకట్రెండు ఫోర్లు కొట్టినా పట్టించుకోనవసరం లేదని రోహిత్ శర్మ చెప్పాడని అన్నాడు. అందుకే వైవిధ్యానికి పోకుండా ఒకే తరహా బంతులు వేసి వికెట్లు సాధించానని తెలిపాడు.
వికెట్ కీపర్, సీనియర్ బౌలర్, బ్యాటర్లతో నిరంతరం సంప్రదించాను. కెప్టెన్ సలహాలు తీసుకున్నాను. వాళ్లు ఎలా చెబితే అలా వేశాను. వారితో మాట్లాడటం వల్ల బ్యాటర్ల వీక్ నెస్ లు తెలిశాయని తెలిపాడు.