Essential prices : నిత్యావసర వస్తువుల ధరలు నింగిని అంటుతున్నాయి. కూరగాయల ధరలు కొనేలా లేవు. నోటికి రుచిగా.. కడుపునిండా భోజనం చేయడం సాటి మధ్యతరగతి కుటుంబానికి కలే అయ్యేలా ఉంది. రోజురోజుకూ పెరుగుతున్న ధరలు చూస్తే.. మీక్కూడా ఇలాగే అనిపిస్తుంది. వర్షాభావ పరిస్థితులు, అకాల వర్షాలు పంటల దిగుబడిని తగ్గించాయి. చేతికి పంట అందివచ్చే సమయంలో.. పంటలు వర్షార్పణమయ్యాయి. దాంతో కూరగాయలతో పాటు ఇతర నిత్యవసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి.
బియ్యం ధరలు రోజుకొకలా పెరుగుతున్నాయి. నవంబర్ లో సోనామసూరి బియ్యం కిలో రూ.65 ఉండేది. డిసెంబర్ నాటికి కిలో రూ.75 అయ్యింది. జనవరి లో కిలో రూ.80 కి పెరిగింది. ప్యాకింగ్ , రవాణా ఛార్జీలతో క్వింటా బస్తా బియ్యం ధర రూ.6500 నుంచి రూ.7000 వరకు పలుకుతుంది. రిటైల్ షాపుల్లో రూ.75 నుంచి రూ.80 వరకూ ఉంది. విజయ మసూరి బియ్యం క్వింటా బస్తా ధర రూ.5900 నుంచి రూ.6300 వరకూ పలుకుతోంది.
కూరగాయలు ధరల విషయనికి వస్తే కిలో రూ.80కి పైగా ఉన్నాయి. పండగలు, వేడుకలు,పెళ్లిళ్లు ఉండటంతో నాన్ వెజ్ ధరలు కూడా బాగా పెరిగాయి. నూతన సంవత్సరం సందర్భంగా నగరంలో 5 లక్షల కిలోల చికెన్ అమ్ముడు పోయింది. లైవ్ కోడి ధర రూ.140 ఉండగా.. స్కిన్ లెస్ చికెన్ ధర రూ.240 కి చేరింది. మటన్ కిలో రూ.820 ఉంది. బోన్ లెస్ మటన్ కిలో రూ.1020 అయ్యింది. కోడిగుడ్ల ధరలు డజన్ రూ.75 నుంచి రూ.80 వరకు ఉన్నాయి. నిత్యవసర వస్తువుల ధరలు ఇలా పెరుగుతూ ఉంటే.. ఇంకేం తినాలని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.