విజయవాడలో కేశినేని బ్రదర్స్ మధ్య రాజకీయ వివాదం ముదురుతోంది. అన్నదమ్ముల మధ్య ఎంపీ సీటు కోసం అన్నదమ్ముల మధ్య ఆదిపదత్య పోరు సాగుతోంది. పచ్చగడ్డి వేస్తే భగ్గమంటోంది. వీరిద్దరి రాజీకయ రచ్చతో తిరువూరు పార్టీ కార్యాలయం రణరంగంగా మారింది. ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు దాడులకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. విషయం తెలిసి రంగంలోకి దిగిన పోలీసులను సైతం లెక్క చేయకుండా రెచ్చిపోయారు. దీంతో ఈ ఘర్షణలో తిరువూరు ఎస్సై సతీష్కు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.
తిరువూరులో ఈ నెల 7న టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో టూర్ ఏర్పాట్లపై దృష్టిసారించిన పార్టీ నేతలు టీడీపీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు కేశినేని బ్రదర్స్ వెళ్లారు. 100 మందితో బైక్ ర్యాలీగా ముందుగా వెళ్లిన కేశినేని నాని.. అక్కడ ఏర్పాటు చేసిన పోస్టర్లలో నాని ఫొటో చిన్నదిగా ఉండటంతో ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. పోస్టర్లు చించి, కుర్చీలు విసిరేసి నానా రచ్చ చేశారు. ఇదే విషయమై ఇన్చార్జ్ దేవదత్పై గొడవకు దిగారు. ఈ వివాదం నడుస్తుండగానే ర్యాలీగా వచ్చిన కేశినేని చిన్ని వర్గం కూడా గొడవకు దిగింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. ఎవరెంత సర్ది చెప్పినా వినకుండా పరస్పర దాడులకు పాల్పడ్డారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను వారించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తిరువూరు ఎస్సై సతీశ్ తలకు బలమైన గాయంకావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ రణరంగ వాతావరణంతో మీటింగ్ క్యాన్స్ల్ చేసుకుని టీడీపీ ముఖ్య నేతలు వెనుతిరిగారు.
కేశినేని వ్యవహారంపై ఇరువురికి సర్ది చెప్పలేక పార్టీ అధిష్టాతం చేతులెత్తేస్తుండటంపై తెలుగు తమ్ముళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కఠిన నిర్ణయం తీసుకొని ఎవరికో ఒకరికి పార్లమెంట్ బాధ్యతలు అప్పజెప్పకపోతే.. పార్టీ పరువు మరింత దిగజారే అవకాశం ఉందంంటున్నారు. కాగా.. తిరువూరు పర్యటనలో అయినా చంద్రబాబు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తోంది పార్టీ క్యాడర్. దీంతో కేశినేని బ్రదర్స్ను టీడీపీ అధినేత ఎలా బుజ్జగిస్తారు..? ఎంపీ సీటు ఎవరికి ఫైనల్ చేస్తారన్నది స్థానికంగా ఉత్కంఠ రేపుతోంది.