పోస్టాఫీస్ లో పోస్ట్ మాస్టర్.. ఖాతాదారులు, డిపాజిట్ దారుల డబ్బులు కోటిన్నర పైగా స్వాహాచేసి ఉడాయించాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా నందికొండలోని పైలాన్లో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివారల ప్రకారం.. రామకృష్ణ అనే వ్యక్తి సబ్ పోస్టాఫీస్ లో పోస్ట్ మాస్టర్ గా పని చేస్తున్నాడు. రామకృష్ణ.. ఖాతాదారులకు, డిపాజిట్ దారులకు నకిలీ పాస్ పుస్తకాలు ఇచ్చి ఫోన్ నెంబర్స్ మార్చాడు. పోస్టాఫీస్ లో విత్ డ్రా అయిన ప్రతి అమౌంట్ కు సంబంధించి ఖాతాదారులకు మెసేజ్ వెళ్ళకుండా చేశాడు. అమౌంట్ ను విత్ డ్రా చేసిన ఎలాంటి మెసేజ్ రాకపోవడంతో ఎవరికీ అనుమానం కలుగలేదు.
గత నెలలో పోస్టాఫీస్ లో ఉన్నతాధికారులకు అకౌంట్ విషయంలో అనుమానం వచ్చింది. పోస్టల్ ఎంక్వైరీ చేయగా డబ్బు దారి మళ్లిందని తేలింది. పోస్టాఫీస్ అధికారులు సబ్ పోస్ట్ మాస్టర్ ను విధుల నుంచి సస్పెండ్ చేసి అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం పోలీసులు ఎంక్వైరీ చేయగా.. రామకృష్ణ కోటిన్నర డబ్బుతో ఉడాయించినట్లు తేలింది. దాంతో అతనిపై కేసు నమోదు చేశారు. రామకృష్ణ సస్పెండ్ అయినప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. పోలీసులు విచారణ చేస్తున్న విషయం తెలుసుకుని నిడుమనూరు కోర్టులో లొంగిపోయాడు .
పోస్టాఫీస్ లో అధికారులు, పోలీసులు విచారణ చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న డిపాజిట్ దారులు, ఖాతాదారులు తమ పాసుపుస్తకాలతో అక్కడికి పెద్ద ఎత్తున చేరుకొని తమకు ఎవరు న్యాయం చేస్తారని ప్రశ్నించారు. చిన్న మొత్తంలో డబ్బులు విత్ డ్రా చేసిన మెసేజ్ వచ్చేది. అలాంటిది ఇంత భారీ మొత్తంలో డబ్బులు విత్ డ్రా అయినప్పటికీ పోస్టల్ అధికారులు గుర్తించకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని బాధితులు విమర్శించారు. బాధితులకు తప్పనిసరిగా న్యాయం చేస్తామని పోస్టల్ అధికారులు హామీ ఇవ్వడంతో ఖాతాదారులు, డిపాజిట్ దారులు అక్కడి నుండి వెళ్లిపోయారు.