TPCC Meeting: గాంధీ భవన్లో నిన్న జరిగిన మీటింగ్లో టీపీసీసీ నేతలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పని తీరు, పార్లమెంట్ ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఇంకా.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆరు గ్యారెంటీ స్కీముల అమలు చేయాలనే అంశంపై కూడా చర్చ జరిగింది. వీటితో పాటు.. మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని.. తీర్మానాలు చేశారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరుతూ పీసీసీ తీర్మానం చేసింది. పీసీసీ చీఫ్, సీఎం రేవంత్రెడ్డి ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని నేతలంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. తెలంగాణ నుంచి సోనియా పోటీ చేస్తే అసెంబ్లీ ఎన్నికల కంటే మెరుగైనా ఫలితాలు లోక్సభ ఎన్నికల్లో సాధించాలని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే.. సోనియా గాంధీ తెలంగాణ నుంచి లోక్సభ బరి దిగాలని తీర్మానం చేశారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీని విజయంలో కీలకంగా వ్యవహరించిన మాణిక్రావ్ ఠాక్రేను అభినందిస్తూ మరో తీర్మానం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మాణిక్ రావ్ ఠాక్రేకు ముందు.. మాణిక్ రావ్ ఠాక్రే తర్వాతగానే చూడాలని నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. పార్టీ నేతల మధ్య భిన్నాభిప్రాయాలను తొలగిస్తూ అందరూ ఒకే మాటపై ఉండేలా చేయడంలో మాణిక్ రావ్ ఠ్రాకే చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ ఆయనకు అభినందన తీర్మానం చేశారు.
ఇక.. పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధత, నామినేటెడ్ పోస్టుల భర్తీ వంటి అంశాలపై చర్చించి, సభ్యులందరి అభిప్రాయాలు తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన పని చేస్తున్న వారంతా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలని నేతలు కోరారు. గత ప్రభుత్వం.. రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేసిందని అన్నారు. ఒకవైపు ఆర్థికంగా రాష్ట్రాన్ని బలోపేతం చేస్తూనే.. మరోవైపు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో ఒక ఫీల్ గుడ్ వాతావరణం వచ్చిందని.. స్వాతంత్య్రం వచ్చినట్టు ప్రజలు అనుభూతి చెందుతున్నారని తెలిపారు.