Srikakulam :మన దేశంలోని అతికొద్ది సూర్య దేవాలయాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం పట్ణణానికి 2 కి.మీ దూరంలోని అరసవల్లి గ్రామంలో ఉంది. ఇక్కడ కొలువైన సూర్యనారాయణ మూర్తి తన భక్తులకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించే దైవంగా వెలుగొందుతున్నాడు. ఈ ప్రత్యక్ష నారాయణుడి దేవాలయానికి పురాణకాలం నుంచీ గొప్ప చరిత్ర ఉంది. ఒకప్పుడు ఈ ఊరిని హర్షవల్లి అనే వారనీ అదే క్రమేణా అరసవల్లిగా మారిందనే మాట కూడా ఉంది.
Arasavalli temple news(Local news andhra Pradesh): మన దేశంలోని అతికొద్ది సూర్య దేవాలయాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం పట్ణణానికి 2 కి.మీ దూరంలోని అరసవల్లి గ్రామంలో ఉంది. ఇక్కడ కొలువైన సూర్యనారాయణ మూర్తి తన భక్తులకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించే దైవంగా వెలుగొందుతున్నాడు. ఈ ప్రత్యక్ష నారాయణుడి దేవాలయానికి పురాణకాలం నుంచీ గొప్ప చరిత్ర ఉంది. ఒకప్పుడు ఈ ఊరిని హర్షవల్లి అనే వారనీ అదే క్రమేణా అరసవల్లిగా మారిందనే మాట కూడా ఉంది.
స్థల పురాణం
కురుక్షేత్ర యుద్ధం అనంతరం బలరాముడు తీర్థయాత్రకు బయలుదేరిన బలరాముడు వింధ్య పర్వతాలను దాటి దండకారణ్యం గుండా కళింగ దేశానికి చేరుకున్నాడట. అక్కడి మాధవ అరణ్యంలోని పద్మనాభ పర్వతం వద్ద ఆయన దైవచింతనలో కాలం గడుపుతున్న సంగతి తెలుసుకున్న స్థానికులు.. ఆయన దర్శనం కోసం వచ్చి, తమ ప్రాంతంలోని కరువు నుంచి విముక్తి పొందే ఉపాయం చెప్పమని ప్రార్థించారట. అప్పుడాయన.. తన ఆయుధమైన నాగలితో అక్కడి భూమిని దున్నగా, పాతాళపు జలధారలు నదిగా మారి ప్రవహించాయట. దానికి నాగావళి అని నామకరణం చేసిన బలరాముడు ఆ నదీ తీరాన శివాలయాన్ని నిర్మిస్తాడు.
Read More : అపార శక్తి కేంద్రాలు.. మన శక్తిపీఠాలు
ఈ వింతను విని, అక్కడ ప్రతిష్టితమైన శివుని దర్శనం కోసం దేవతలంతా దిగిరాగా, ఇంద్రుడు మాత్రం కాస్త ఆలస్యంగా వచ్చాడట. వచ్చీ రాగానే.. తాను పరమ శివుని దర్శించుకోవాలని ప్రయత్నం చేయగా, స్వామి దర్శనానికి ఇది సమయం కాదంటూ.. పరమేశ్వరుడి సేవకులైన నంది, భృంగి వారిస్తారు. దీంతో మండిపడిన ఇంద్రుడు వారిపై వజ్రాయుధాన్ని ఎత్తగా.. కోపించిన నంది.. ఇంద్రుడిని కొమ్ములతో విరిసి పారేయగా, ఆయన సృహతప్పి పడిపోతాడు. ఆ సమయంలో సూర్య భగవానుడు ప్రత్యక్షమై.. ‘నీవు కింద పడిన చోట వజ్రాయుధంతో తవ్వు’ అని ఇంద్రుడికి చెప్పగా, తవ్వి చూసిన చోట.. సూర్య భగవానుడి విగ్రహంతో బాటు ఉష,ఛాయ, పద్మిని అమ్మవార్ల విగ్రహాలు కూడా లభిస్తాయి. వాటిని తీసి పూజించి ప్రతిష్ఠించిన వెంటనే ఇంద్రుడు ఆరోగ్యవంతుడవుతాడు. నాడు.. ఇంద్రుడిచే ప్రతిష్ఠించిన ఆ మూర్తులే నేటికీ అరసవల్లిలో పూజలందుకుంటున్నాయని పురాణ కథనం.
చారిత్రక ఆధారాలు
గతంలో ఈ కళింగ ప్రాంతాన్ని పాలించిన తూర్పు గంగరాజులలో ప్రముఖుడైన దేవేంద్ర వర్మ క్రీ.శ 545లో నేటి ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. వంశధార నదీ తీరాన ఉన్న శ్రీముఖలింగం కళింగ దేశ రాజధానిగా ఉన్న రోజుల్లో ఇప్పిలి అక్కన్న, సూరప్ప అనే సోదరులు.. నాటి రాజును కలిసి సూర్యనారాయణుడు తమకు కలలో కన్పించాడనీ, స్వామి సూచించిన ప్రకారం తమకు వంశధార నదిలో ఆదిత్యుని పూజా విధానానికి సంబంధించిన తాళపత్రాలు దొరికాయని చెప్పగా, ఆ రాజు వారిని అక్కడి పూజారులుగా నియమించాడు. నేటికీ వారి వారసులే అరసవల్లిలో స్వామికి పూజాదికాలు నిర్వహిస్తున్నారు.
17వ శతాబ్దంలో ఈ ప్రాంతం నిజాం పాలనలో ఉండగా, ఇక్కడి సుబేదార్ షేర్ మహ్మద్ ఖాన్ ఈ ఆలయంతో సహా పలు ఆలయాలను ధ్వంసం చేశాడు. ఈ సంగతిని ఆయనే స్వయంగా ఓ పర్షియన్ లిపిలో ఉన్న శాసనంలో వివరించాడు. ఆ సమయంలో సుబేదారు వద్ద పనిచేసే సీతారామశాస్త్రి.. ఆలయంపై జరగబోయే దాడిని ముందుగా తెలుసుకుని, మూలమూర్తిని తవ్వితీసి, బావిలో పడేయించాడు. 150 ఏళ్ల తర్వాత ఎలమంచి పుల్లాజీ పంతులు అనే భక్తుడికి కలలో కనిపించిన ఆదిత్యుడు.. తన ఉనికిని చెప్పగా, ఆ విగ్రహాన్ని తీసి ప్రతిష్ఠించి, నేటి ఆలయంగా తీర్చిదిద్దారు. ఆలయం ప్రక్కన ఉన్న సూర్యగుండాన్ని కళింగ రాజవంశం పాలకుడు దేవేంద్రవర్మ11వ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తుంది.
Read More : తిరుమలలో రథ సప్తమి వేడుకలు.. 3రోజులు సర్వదర్శనం టోకెన్లు బంద్..
ఇతర విశేషాలు
ఈ ఆలయంలో ఏడాదికి రెండు సార్లు సూర్య కిరణాలు గర్బ గుడిలోని మూలవిరాట్టు పాదాలను తాకుతాయి. ఏటా మార్చి 9, 10, 11, 12 మరియు అక్టోబర్ 1, 2, 3, 4 తేదీలలో ఉదయం 6 నుంచి 6:20 నిమిషాల మధ్య జరిగే ఈ అద్భుతాన్ని చూసేందుకు భక్తులు పెద్దసంఖ్యలో అరసవల్లికి వస్తారు. ఈ దేవాలయ ముఖమండపంలో సప్తాశ్వరూఢుడయిన సూర్యుని ఏకశిలా విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. ఈ ఆలయంలో ఇది చైత్ర శుద్ధ ఏకాదశి నుండి బహుళ పాడ్యమి వరకు 6 రోజులు జరిగే రథ సప్తమి వేడుకలు, చివరలో స్వామి కల్యాణోత్సవంలో వేలాది మంది పాల్గొంటారు. అనారోగ్యం, గ్రహబాధలున్న వారు స్వామిని సేవిస్తే.. మంచి ఆరోగ్యం సమకూరుతుందనీ, గ్రహబాధలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. విశాఖపట్టణం నుంచి శ్రీకాకుళానికి బస్సు సర్వీసులున్నాయి. రైలులో వెళ్లేవారు.. శ్రీకాకుళం రోడ్ స్టేషన్ నుంచి దిగి వెళ్లొచ్చు.