BIG Shocks to YCP : ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. టీడీపీలోకి పెరుగుతున్న వలసలతో వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి.. ఇప్పటికే కొత్త ఇన్చార్జ్ల నియామకం, ఎమ్మెల్యేల స్థానాలు మార్పు వంటి అంశాలతో చెలరేగుతున్న అసంతృప్తి జ్వాలలు అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అది సరి చేసుకోవడానికే నానా పాట్లు పడుతున్న వైసీపీ పెద్దలు వలసల ఎపిసోడ్తో తలలు పట్టుకుంటున్నారంట. తాజాగా వివిధ నియోజకవర్గాల వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఫ్యామిలీతో పాటు స్వయానా విజయసాయి బావమరిది అయిన మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథరెడ్డి వంటి కీలకనేతలు కూడా జగన్ గూటిని వదిలేయడం పార్టీ శ్రేణులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తోందంటున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పక్షం వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన మంగళగిరి ఆర్కే రాజీనామాతో మొదలైన అసమ్మతి అలజడి జగన్ కోటరీని ఉక్కిరిబిక్కిరి చేస్తోందంట. ఇప్పటికే అసంతృప్తి ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు వైసీపీకి దూరమయ్యారు. ఇటీవల ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా జగన్కు స్ట్రోక్ ఇచ్చారు.
మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఏక వాక్య లేఖను ముఖ్యమంత్రి జగన్ కు పంపారు. అందులో తాను తన కొడుకులు, అనుచరులతో కలిసి పార్టీ వీడుతున్నట్లు ఒకే ఒక్క వాక్యం పేర్కొన్నారు. ఈ రాజీనామా ప్రతులను ఆయన ప్రభుత్వ ముఖ్యసలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డికి పంపారు. ఆ వాక్యంలో కనీసం రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి పేరు కూడా ప్రస్తావించలేదు.
ఇక పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు వ్యతిరేకత పేరు చెప్పి తనకు జగన్ పార్టీ టికెట్ నిరాకరిస్తే అంగీకరించేది లేదని కుండబద్దలు కొట్టేశారు. వైసీపీ అంటే జగన్ మాత్రమేననీ.. ఆయన తరువాత ఎవరికైనా ఏదైనా పని చేసే అవకాశం ఉందంటే వారు వాలంటీర్లు మాత్రమేనని పేర్కొన్న బాబు.. ఇప్పుడు అసంతృప్తి పేరు చెప్పి ఎమ్మెల్యేలను బలిచేయడమేంటని జగన్ ను ప్రశ్నిస్తున్నారు. ప్రజలలో ఉన్న వ్యతిరేకత అంతా జగన్ పైనే తప్ప ఎమ్మెల్యేలపై కాదని ఆయన మీడియా ముందు నిర్మోహాటంగా తేల్చేశారు. తాడేపల్లి ప్యాలెస్కు పరిమితమై ప్రజల ముందుకు రాలేని ముఖ్యమంత్రి జగన్ ప్రజా వ్యతిరేకత తనపై లేదని ఎలా చెబుతారని ప్రశ్నించి పార్టీ పెద్దలను ఉలిక్కి పడేలా చేశారు.
ఇలాంటి అసంతృప్తి నేతల లిస్టులో చాలా మంది ముఖ్య నేతలే కనిపిస్తున్నారు. రేపల్లెలో మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ, పెనుగొండలో మాజీ మంత్రి శంకర్ నారాయణ, పల్నాడు జిల్లా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, పెనమలూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పార్థసారధి, విశాఖపట్నంలో వంశీకృష్ణ యాదవ్ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే కనిపిస్తోంది. అలాగే సీనియర్ నేతలు డొక్కా మాణిక్యవరప్రసాద్, పార్థసారథి వంటి వారు జగన్ అపాయింట్మెంట్ కోసం బహిరంగంగానే అడుక్కునే పరిస్థితి కనిపిస్తుండటం వైసీపీ శ్రేణులను కన్ఫ్యూజన్లో పడేస్తోందంట.
ఆ క్రమంలో తాజాగా వైసీపీకి మరో పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీలో నెంబర్ టూనని ఫీలైపోయే రాజ్యసభ సభ్యుడు విజయాసాయిరెడ్డికి సయానా బావమరిది, కడప జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథరెడ్డి ఫ్యాన్ పార్టీకి రాంరాం చెప్పి సైకిల్ ఎక్కేశారు. లక్కిరెడ్డిపల్లె మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం కడప జిల్లాలో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బే అంటున్నారు. 1994లో గడికోట ద్వారకానాథరెడ్డి లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు. 1999లో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వకపోవడం. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009లో సైతం టికెట్ కోసం ప్రయత్నించినా దక్కలేదు. వైసీపీ ఆవిర్భావం తర్వాత 2014లో ఆ పార్టీ టికెట్ను ఆశించారు. 2019లో సైతం వైసీపీ, తెలుగుదేశం పార్టీల తరఫున టికెట్ను ఆశించినా దక్కలేదు.
ఆ తర్వాత ద్వరకానాథ్ రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం ఆయన రాయచోటి టీడీపీ టికెట్ను ఆశిస్తున్నారు. ద్వారకానాథరెడ్డి తండ్రి రామసుబ్బారెడ్డి 1978లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1962 నుంచి ఆయన కుటుంబం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంది. ఎంపీ విజయసాయిరెడ్డి భార్య ద్వారకానాథరెడ్డికి స్వయానా అక్క. ద్వారకానాథరెడ్డితో పాటు ఆయన అన్న గడికోట సురేంద్రనాథరెడ్డి, నందమూరి తారకరత్నకు స్వయానా అత్త అయిన ద్వారకానాథరెడ్డి అక్క హరెమ్మ కూడా పసుపు కండాలు కప్పేసుకున్నారు. ఏపీ పాలిటిక్స్లో అలా సాగిపోతోంది వలసల పర్వం.