YS Sharmila Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ నివాసానికి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల వెళ్లారు. భర్త అనిల్ కుమార్, కుమారుడు రాజారెడ్డి, ఇతర కుటుంబసభ్యులతో కలిసి అన్న నివాసానికి వచ్చారు. షర్మిల ఫ్యామిలీ కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరంలో దిగింది. అక్కడి నుంచి తాడేపల్లిలోని సీఎం జగన్ ఇంటికి వెళ్లారు. తన కుమారుడు రాజారెడ్డి పెళ్లి ఆహ్వాన పత్రికను జగన్కు అందించారు.
షర్మిల వెళ్లిన తర్వాత మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా సీఎం నివాసానికి వెళ్లారు. షర్మిల వెళ్లిన కాసేపటికి సీఎం క్యాంపు ఆఫీస్కు ఆర్కే వచ్చారు. అయితే ఆర్కే వాహనాన్ని లోపలికి వెళ్లకుండా తొలుత పోలీసులు అడ్డుకున్నారు. కాసేపటి తర్వాత ఆదేశాలు రావడంతో ముఖ్యమంత్రి నివాసంలోకి ఆర్కేను అనుమతించారు.
గన్నవరం నుంచి వస్తున్న సమయంలో తన వాహనం ట్రాఫిక్లో చిక్కుకుందని ఆర్కే వెల్లడించారు. అందువల్లే షర్మిల వెంటే వెళ్లలేకపోయాయని తెలిపారు. మరోవైపు షర్మిల గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఆమె ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత తాను కూడా కాంగ్రెస్లో చేరతానని ఆర్కే ప్రకటించారు. ఆ పార్టీ విధానాల ప్రకారం నడుచుకుంటానని స్పష్టం చేశారు. జగన్పై ఆరోపణలు, విమర్శలు చేసే విషయంతో కాంగ్రెస్ ఆదేశాలను పాటిస్తానని తేల్చిచెప్పారు. షర్మిలతోపాటు ఎవరెవరు పార్టీలో చేరతారనే విషయం తనకు తెలియదని ఆర్కే అన్నారు.