AP Politics : ఏపీలో పొలిటికల్ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తెలుగురాష్ట్రాల్లో ఒకేరోజు రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్తో ఇదివరకే చేసుకున్న ఒప్పందం మేరకు పార్టీ విలీనం చేసేందుకు చెల్లెలు షర్మిల ఢీల్లీ వెళ్తుండగా.. కేసీఆర్ను పరామర్శించేందుకు అన్న జగన్.. హైదరాబాద్ వస్తున్నారు. గతంలోనే కేసీఆర్ హిప్ రీప్లేస్ ఆపరేషన్ జరిగింది. అప్పుడు తెలుగురాష్ట్రాలకు చెందిన సినీ-రాజకీయ ప్రముఖులు వచ్చి ఆయన్ను పరామర్శించారు. అప్పుడు రాని జగన్.. ఇన్నిరోజుల తర్వాత వస్తున్నారంటే.. ఏదో ఉందనే ప్రచారం సాగుతోంది.
మరోవైపు.. పార్టీ విలీనం కోసం షర్మిల ఢిల్లీ వెళ్తున్నారు. అటు.. టీడీపీ, పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకుని వైసీపీ విముక్త ఏపీ అంటూ భీష్మించుకున్నారు. ఈ నేపథ్యంలో ఏం చేయాలో తెలియక.. కేసీఆర్ సలహా కోసం జగన్ వస్తున్నారనే వాదనలూ ఉన్నాయి. తోడబుట్టిన చెల్లెలు కాంగ్రెస్లో చేరి తనకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి వస్తే.. ఏపీలో తన పరిస్థితి ఏంటనే ఆందోళనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ సలహా తీసుకుంటారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.