YSRCP Internal Rift | ఇన్నాళ్లు జగన్ భజన చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల పరీక్షల ముందు అవసరమైతే పార్టీ వీడుతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి చెల్లెలు అయిన వైఎస్ షర్మిల ఏకంగా కాంగ్రెస్ పార్టీలో చేరి నేరుగా తన అన్నతో ఢీకొనబోతున్నారు. షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడితే.. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు ఆమె వెంట క్యూ కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.
YSRCP Internal Rift | ఇన్నాళ్లు జగన్ భజన చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల పరీక్షల ముందు అవసరమైతే పార్టీ వీడుతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి చెల్లెలు అయిన వైఎస్ షర్మిల ఏకంగా కాంగ్రెస్ పార్టీలో చేరి నేరుగా తన అన్నతో ఢీకొనబోతున్నారు. షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడితే.. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు ఆమె వెంట క్యూ కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.
వైసీపీ నాయకులలో చాలామంది ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ అసంతప్తి జాబితాలో ముందుగా సీనియర్ నాయకులు మాజీ వైసీపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఆయన చాలాసార్లు తనకు వ్యతిరేకంగా పార్టీలో కుట్ర జరుగుతోందని ఆరోపణలు చేశారు. స్వయంగా జగన్ వెళ్లి బాలినేని శ్రీనివాస్ను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. అయినా జగన్ , సజ్జల రామకృష్ణా రెడ్డితో కూడిన వైసీపీ అధిష్థానం ఆయనను ఒంగోలు నుంచి తప్పించేందుకు రేడీగా ఉంది. ఇప్పటికే గిద్దలూరు నుంచి పోటీ చేయాలని ఆయనకు ఫోన్లు వచ్చినట్లు సమాచారం. పార్టీ ఆదేశాలను బాలినేని పాటించపోతే ఆయనను పక్కన పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. బాలినేని గిద్దలూరుకు వెళితే.. సిద్దా రాఘవరావు కుమారుడు సుధీర్ ఒంగోలు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది. దీంతో బాలినేని ఏకంగా వేరే పార్టీలో చేరుతానని బెదిరించినట్లు టాక్ నడుస్తోంది.
వైఎస్ షర్మిల కాంగ్రెస్ చేరడం లాంఛనం మాత్రమే కావడంతో ఆమె అధికారికంగా కాంగ్రెస్లో చేరినట్లు ప్రకటించముందే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి తాను షర్మిల వెంట నడుస్తానని ప్రకటించేశారు. షర్మిల కూడా తన కోసం ఎవరు ముందు వస్తే వారికే ప్రాధాన్యం ఇస్తారని తెలుస్తోంది. దీంతో వైసీపీ అసంతృప్తి నేతలు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ కోసం ఆమె వెంట పరుగులు తీసే అవకాశం ఉంది. ఈ వరుసలో ఆళ్ళ రామకృష్ణ రెడ్డితో పాటు మల్లాది విష్ణు కూడా ఉన్నారని సమాచారం.
వైసీపీ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి బావమరిది అయిన గడికోట ద్వారకనాథ రెడ్డి కూడా వైసీపీని వీడి టిడిపిలోకి చేరారు. జగన్ పాలన అవినీతమయమంటూ విమర్శించారు. పైగా విజయసాయి రెడ్డి కూడా వైసీపీ వీడే అవకాశాలున్నాయని చెప్పారు. 2014, 2019 ఎన్నికల్లో ద్వారకనాథ రెడ్డి వైసీపీ టికెట్ ఆశించి భంగపడ్డారు.
అలాగే మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేశారు. మంత్రి గుడివాడ అమర్నాథ్తో ఉన్న వైరుధ్యాలు, వైసీపీ అధిష్ఠానం పట్టించుకోకపోవడం లాంటి కారణాలతో దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఆయనతోపాటు ఆయన కుమారుడు దాడి రత్నాకర్ టిడిపిలో చేరుబోతున్నట్లు ప్రకటించారు.
వైసీపీ నియోజకవర్గాల ఇన్ఛార్జుల రెండో జాబితా ప్రకటించింది. ఈ జాబితా ప్రకారం.. విజయవాడ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుని తప్పించి ఈసారి ఆ స్థానంలో వెల్లంపల్లి శ్రీనివాస్కు కేటాయించారు. దీంతో ఎమ్మెల్యే మల్లాది విష్ణు అనుచరులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేశారు. ప్రస్తుతం మల్లాది విష్ణు తన అనుచరులతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకోనున్నారు.
ఇక అందరికంటే ఎక్కువగా చెప్పుకోవాల్సింది.. నిత్యం జగన్ భజన చేసే మంత్రి గుడివాడ అమర్ నాథ్ గురించి. ఆయన కూడా ఈ అసంతృప్తుల జాబితాలో ఉన్నారు. ఎందుకంటే నియోజకవర్గాల రెండో జాబితాలో ఆయన పేరు లేదు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అనకాపల్లి నుంచి ఈసారి మలసాల భరత్ పోటీ చేయబోతున్నారు. దీంతో గుడివాడ అమర్ నాథ్ కూడా షర్మిల వెంట వెళ్లే అవకాశాలు లేకపోలేదు.
మరోవైపు విజయవాడ వెస్ట్ వైసీపి సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి కూడా అసంతృప్తితో ఉన్నారు. ఈసారి ఆయనను విజయవాడ సెంట్రల్కు మార్చడంతో ఆయన పరిస్థితి తలకిందులైంది. ఇంతకాలం ఎమ్మెల్యే వెల్లంపల్లి విజయవాడ వెస్ట్లో కష్టపడి పట్టు సాధించారు. ఇప్పుడు ఒక్కసారిగా తనను సెంట్రల్ నియోజకవర్గానికి మారిస్తే ఎన్నికల్లో ఓటమి ఎదురవుతుందనే భయంలో ఉన్నారని టాక్. దీనికోసమే ఆయన జాబితా విడుదల కాగానే తాడేపల్లికి బయలుదేరారు.
ఇదే పరిస్థితి మరో వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్ కూడా ఎదుర్కొంటున్నారు. ఇంతకాలం ఆయన విజయవాడ ఈస్ట్లో పార్టీ కోసం కష్టపడ్డారు. ఆ నియోజకవర్గంలో తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పర్చుకున్నారు. దీంతో కొన్ని రోజుల క్రితం వరకు ఆయనే ఈసారి విజయవాడ ఈస్ట్ పోటీ చేయబోతున్నట్లు వైసీపీ అగ్రనేతలు సంకేతాలిచ్చారు. కానీ తాజాగా దేవినేని అవినాష్ పెనమలూరుకు వెళ్లాలని పార్టీ ఆదేశించింది. ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా డోలాయమానంగా తయారైంది.
అసంతృప్తుల జాబితాలో తాజాగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కూడా చేరారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న రామచంద్రాపురంలోనే ఆయన చెప్పినట్లు చెల్లడం లేదు. ఇప్పుడు రామచంద్రాపురం సీటుని మరో సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు పిల్లి సూర్యకు జగన్ టీమ్ కేటాయించింది. మంత్రి చెల్లుబోయినకు రాజమండ్రి రూరల్ ఖాయమైనట్లు సమాచారం.