T20 World Cup 2024 : టీమ్ ఇండియాలో కీలకమైన ఇద్దరు ప్లేయర్లు ఎవరంటే రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ అని ఠపీమని చెప్పేస్తారు. ఒకనాడు సచిన్ టెండూల్కర్ ఎలా వెన్నుముకలా ఉండేవాడో, ఇప్పుడు వీరిద్దరూ కుడి,ఎడమ భుజాల్లా కాస్తున్నారు. అందుకని వీరిని తొలగించడం అంటే అనుకున్నంత ఆషామాషీ కాదు. ఎందుకంటే 140 కోట్ల మంది భారతీయుల నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకోవడం ఎవరి తరం కాదు.
మొన్ననే చూశాం కదా.. ముంబై ఇండియన్స్ భరతం పట్టిన రోహిత్ అభిమానులు, ఇక బీసీసీఐని అయితే ఒక రేంజ్ లో ఆడుకుంటారు. అది ఐపీఎల్ లో ప్రైవేటు ఫ్రాంచైజీ కాబట్టి వారు బతికి బట్టకట్టారు. బీసీసీఐ అలా కాదు.. ప్రజలతో ముడిపడిన భారతీయ సంస్థ. ప్రతీ భారతీయుడికి సమాధానం చెప్పాల్సిందే. అంటే ఒక్కరు కోర్టులో కేసు వేసినా, బదులు చెప్పక తప్పని పరిస్థితి బీసీసీఐకి ఉంది. అందుకే వాళ్లిద్దరి విషయంలో నిర్ణయం తీసుకోవాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాలి.
త్వరలో టీ 20 వరల్డ్ కప్ జరగనుంది. అంతేకాదు భారత్ లో ఆఫ్గనిస్తాన్ పర్యటన ఉంది. అక్కడ 3 టీ 20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ ఇద్దరూ కూడా ఏడాదిగా టీ 20 లు ఆడటం లేదు. ఇప్పుడు వీరిద్దరిని ప్రపంచకప్ నకు ఎంపిక చేయాలా? లేదా? అనేది బీసీసీఐ సెలక్షన్ కమిటీకి అగ్ని పరీక్షలా మారింది. అందుకే సమయం లేక, ఇక లాభం లేదనుకుని, డైరక్టుగా అడిగేద్దామని భావించి సౌతాఫ్రికాకి అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ బృందం బయలుదేరింది.
ఇప్పుడక్కడ వారు సమావేశం కానున్నారు. రెండో టెస్ట్ ముగిసే జనవరి 7లోపు వీరిద్దరినీ ప్రత్యేకంగా కూర్చోబెట్టి, అసలు టీ 20 మ్యాచ్ లు ఆడతారా? లేదంటే ఇక్కడితో చాలిస్తారా? అని ప్రశ్నించేలా కనిపిస్తోంది. దీంతో వీరు చెప్పే సమాధానం బట్టి జట్టు కూర్పు ఆధారపడి ఉంటుంది.
ఎందుకంటే టీ 20 మ్యాచ్ ల్లో స్థానం కోసం ఎంతోమంది ప్రతిభావంతులు మెయిన్ డోర్ వద్ద ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరు చెప్పే మాటపై ఎవరు 15 మందిలో ఉంటారు? ఎవరు ఉండరనేది తేలిపోతుంది. రెండోటెస్ట్ ముగిసేలోపు వ్యవహారం ఒక కొలిక్కి వస్తుందని అంటున్నారు.
ఆఫ్గనిస్తాన్ తో జరిగే టీ 20 మ్యాచ్ ల్లో, ఇంకా ఐపీఎల్ లో ఎవరు బాగా ఆడుతున్నారో చూసి, ఫైనల్ జట్టు ఎంపిక ఉంటుందని అంటున్నారు. అందుకే ముందు వీరిద్దరి సంగతి తేల్చేస్తే.. సెలక్షన్ కమిటీకి గుండె బరువు తగ్గుతుందని అంటున్నారు. అంతేకాదు కెప్టెన్సీపై కూడా క్లారిటీ వస్తుందని అంటున్నారు.