Cold Wave : శీతలగాలులతో భారతావని గజగజలాడుతోంది. దేశంలో పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రధానంగా ఉత్తర భారతదేశాన్ని చలిపుణి వణికిస్తోంది. కశ్మీర్లో టెంపరేచర్ మైనస్కు పడిపోయింది. ఉష్ణోగ్రత -7 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా దిగువకే నమోదవుతోంది. ఢిల్లీ సహా దేశంలో పలు ప్రాంతాల్లో ఉదయం, రాత్రి వేళల్లో దట్టమైన మంచు కురుస్తోంది. దీంతో విమాన, రైళ్ల సర్వీసులకు అంతరాయం కలిగింది. ఢిల్లీలో 26 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
రానున్న కొన్ని రోజులు కూడా అతి శీతల పరిస్థితులే ఉంటాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరించింది. శ్రీనగర్లోని దాల్ సరస్సు పాక్షికంగా ఘనీభవించింది. దీంతో బోట్లు నిలిచిపోవడంతో టూరిస్టులు అవస్థలు పడుతున్నారు. కనిష్ఠ ఉష్ణోగ్రతలతో పైపులైన్ల నీరు కూడా గడ్డకట్టిపోయిన దరిమిలా స్థానికులకు దైనందిన అవసరాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో దేశవ్యాప్తంగా 23 లక్షల మంది ప్రయాణికులకు ఇక్కట్లు తప్పలేదు.
ఢిల్లీని కూడా శీతలగాలులు కమ్మేశాయి. 7 డిగ్రీల సెల్సియస్ కన్నా దిగువనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రతతో రహదారులపై నిరాశ్రయులు పడరానిపాట్లు పడుతున్నారు. ఢిల్లీ కాలుష్యానికి చలి తీవ్రత తోడు కావడంతో ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. శీతాకాలాల్లో వాయు కాలుష్యం మరీ డేంజర్. నోయిడాలో 8వ తరగతి వరకు పాఠశాల విద్యార్థులకు సెలవులు ప్రకటించారు. 6వ తేదీ వరకు బడులను మూసివేశారు.
హైదరాబాద్నూ చలిపులి భయపెడతోంది. మంగళవారం ఉష్ణోగ్రతలు 17.4 డిగ్రీల సెల్సియస్కు చేరాయి. అయితే గత సంవత్సరంతో పోలిస్తే చలి తీవ్రత తక్కువే. నిరుడు ఇదే సమయానికి 14.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉన్నాయి. 17-18 డిగ్రీల సెల్సియస్ మధ్య కొంత కాలం కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉదయం మంచు కురిసే అవకాశాలున్నాయి.