AP BJP : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హీట్ మరింత పెరుగుతుంది. తాజాగా బీజేపీ కూడా ఏపీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే విజయవాడలో ఈరోజు సమావేశం నిర్వహించింది. బీజేపీ జిల్లా ఇంఛార్జులు, పదాధికారులు, జిల్లా అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో జాతీయ సహ సంఘటన కార్యదర్శి శివ ప్రకాష్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. అలానే బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో పాటు పలువురు ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. రేపు పలువురు ముఖ్య నేతలతో బీజేపీ అగ్రనేత తరుణ్ చుగ్ భేటీ కానున్నారు.
కాగా ఈరోజు జరిగిన సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ గురించి.. తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి నేతలు చర్చించారు. రాబోయే ఎన్నికలకు ఈ సమావేశం చివరిదని.. ఏపీకి చేసిన మేలు ప్రజలకు వివరించే బాధ్యత పదాధికారులదే అని పురందేశ్వరీ స్పష్టం చేశారు. కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం.. తమ పథకాలుగా చెప్పుకుంటోందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేస్తే.. వైసీపీ ఆ అప్పులను 12 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెంచిందని ఆమె మండిపడ్డారు. 5 లక్షల ఉద్యోగాలిస్తామన్న సీఎం జగన్ హామీ ఏమైందని ప్రశ్నించారు.
ఇక రేపు జరగబోయే సమావేశానికి బీజేపీ అగ్రనేత తరుణ్ చుగ్ హాజరుకానున్నారు. కిరణ్కుమార్ రెడ్డి, సీఎం రమేశ్ , సుజనా చౌదరి, సత్యకుమార్.. తరుణ్ చుగ్ తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలోనే ఏపీలో పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. టీడీపీ, జనసేనతో కలిసి వెళ్లే అంశంపై నేతల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు తరణ్ చుగ్.