Jubilee hills: రోడ్డుపై వెళ్లేవారిని లిఫ్ట్ అడిగి.. వారిని బెదిరించి అందినకాడికి డబ్బులు గుంజుతున్న కిలాడీ లేడీని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నయీమా సుల్తాన్ (32) అనే మహిళ వాహనదారులను లిఫ్ట్ అడిగి బ్లాక్ మెయిల్ చేస్తోంది. అర్జెంటుగా వెళ్లాలని వాహనదారులను లిఫ్ట్ అడిగి.. ఆపై అత్యాచారం పేరుతో బెదిరించి వారి నుంచి డబ్బు గుంజుతోంది. జూబ్లిహిల్స్ నుంచి కేబీఆర్ పార్క్ వరకూ లిఫ్ట్ కావాలని అడుగుతుంది. కారు ఎక్కిన తర్వాత బట్టలు చించుకుని.. నాపై అత్యాచారం చేశావంటూ సదరు డ్రైవర్ ను బెదిరిస్తుంది. తాను న్యాయవాదిని అని, అడిగినంత డబ్బు ఇవ్వకపోతే పలు సెక్షన్ల కింద కేసులు పెడతానని బెదిరింపులకు పాల్పడుతోంది.
మహిళ బెదిరింపులతో.. ఒక డ్రైవర్ జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆమె ఆగడాలు వెలుగుచూశాయి. నయీమా సుల్తాన్ పై ఐపీసీ 389 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెపై హైదరాబాద్ లోని పలు స్టేషన్లలో ఇప్పటికే 17 కేసులున్నట్లు గుర్తించారు. నిందితురాలి వద్ద వందలాది కేసులకు సంబంధించిన కేస్ స్టడీస్ వివరాలు లభించాయి. వాటి ఆధారంగానే ఏ కేసులో ఎలాంటి శిక్ష పడుతుందో తెలుసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.