BRS : పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. నేటి నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. ఆదిలాబాద్ పార్లమెంట్లోని ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. సిర్పూర్, ఆదిలాబాద్, ఖానాపూర్, బోథ్, నిర్మల్, ముధోల్ నియోజకవర్గాల ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కేసీఆర్ ఆదేశాల మేరకే ఈ సమావేశాలు నిర్వహిస్తునట్లు కేటీఆర్ వెల్లడించారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 63 స్థానాలు గెలిచిన బీఆర్ఎస్.. 11 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 88 ఎమ్మెల్యే సీట్లు గెలిచిన గులాబీ పార్టీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఆశించిన ఫలితాలు సాధించలేదు. ఆ ఎన్నికల్లో 9 స్థానాలను మాత్రమే కైవసం చేసుంది. 2014 కంటే 2018 ఎన్నికల్లో 25 ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ గెలిచినా పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే సరికి గతంలో కంటే రెండు ఎంపీ సీట్లు తగ్గాయి.
2014లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. కానీ 2018లో ముందస్తుగా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలొచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమైన బీజేపీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా 4 స్థానాలు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ మూడు స్థానాలు దక్కించుకుంది.
తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. 39 స్థానాలు మాత్రమే దక్కించుకున్న బీఆర్ఎస్.. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు గెలవాన్న లక్షంతో వ్యూహాలను రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కేటీఆర్ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.