Alla Ramakrishna Reddy : ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. వైఎస్ షర్మిలతో కలిసి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఏపీ నుంచి కాంగ్రెస్ లో చేరబోయే మొదటి ఎమ్మెల్యేను తానేనన్నారు. అలానే షర్మిలతోపాటు సీఎం జగన్ ను కలవడానికి వెళ్తున్నట్లు ఆర్కే వెల్లడించారు.
అమరావతి రాజధానికి తాను వ్యతిరేకం కాదని ఆర్కే కొత్త స్వరం అందుకున్నారు. కానీ బలవంతపు భూసేకరణకు మాత్రమే వ్యతిరేకమని స్పష్టం చేశారు . ప్రస్తుతం ఆర్కే చేసిన కామెంట్స్ ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంటే ఆర్కే ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల సమయంలో ఆర్కేకు మంత్రి పదవి ఇస్తానని బహిరంగంగానే జగన్ ప్రకటించారు. వైసీపీ అధికారంలోకి వచ్చినా జగన్ కేబినెట్ 1.0, కేబినెట్ 2.0లోనూ ఆర్కేకు స్థానం దక్కలేదు. అయినా సరే ఎక్కడా తన అసంతృప్తిని వ్యక్తం చేసే ప్రయత్నం చేయలేదు. కానీ ఈసారి మంగళగిరి టిక్కెట్ దక్కదని తేలడంతో ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. మంగళగిరి ఇన్ ఛార్జ్ గా గంజి చిరంజీవిని నియమించడంతో ఆర్కే ఈ నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు వైఎస్ ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నారు షర్మిల. ఆమెకు ఏపీ బాధ్యతలను కాంగ్రెస్ అధిష్టానం అప్పగిస్తుందనే వార్తలు వస్తున్నారు. ఈ విషయంపైనా ఇంతకుముందే ఆర్కే స్పందించారు. షర్మిల వెంట నడుస్తానని ప్రకటించారు.
గురువారం షర్మిల ఢిల్లీలో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్కే కాంగ్రెస్ లో తాను చేరడంపై క్లారిటీ ఇచ్చారు. మరి వైసీపీలో టిక్కెట్ దక్కని నేతలందరూ ఇదే బాట పట్టే అవకాశం ఉందా? పార్టీలో అసంతృప్తలను బుజ్జగించకపోతే వారు కాంగ్రెస్ చేరిపోతారా? అంటే అవుననే మాటలు వినిపిస్తున్నాయి.