YSRCP : ఇప్పటికే నియోజకవర్గాల ఇన్ ఛార్జుల మార్పులు చేర్పులు వైసీపీలో అలజడి రేపుతున్నాయి. తాజాగా సెకండ్ లిస్ట్ విడుదలతో పార్టీలో వేడి మరింత పెరిగింది. మొదటి జాబితా ప్రకటన తర్వాత కొందరు అసంతృప్తితో ఏకంగా పార్టీలకు రాజీనామా చేసేశారు. మరి ఈసారి ఇంకెంత మంది రాజీనామా చేస్తారో? పాత వారిని తొలగించి.. కొత్త వారికి అవకాశం ఇవ్వడం జగన్కు కలిసి వస్తుందా? లేక బెడిసి కొడుతుందా?. అసలే వైసీపీ ఈసారి గెలుపు అవకాశాలపై అనుమానాలు వ్యక్తమవుతున్న సమయంలో ఈ మార్పులు, చేర్పులు సీఎం జగన్ కు పెద్ద తలనొప్పిగా మారాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ల రెండో జాబితాలో సామాజిక సమీకరణాల ఆధారంగా రూపొందించినట్టు తెలిపారు వైసీపీ అగ్రనేతలు. గెలుపే ప్రామాణికంగా మొత్తం 27మందితో రెండో జాబితా విడుదల చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ లిస్ట్లో కొందరు ఎమ్మెల్యేలను తప్పించి కొత్త వారికి అవకాశం కల్పించారు జగన్ .రీజినల్ కో ఆర్డినేటర్లతో చర్చించి పలు నియోజకవర్గాల ఇన్చార్జీలను సీఎం జగన్ ఖరారు చేశారు. రెండో జాబితాలో పలువురికి స్థానచలనం జరిగింది. అలాగే పలువురు ఎమ్మెల్యేల వారసులకు ఇన్ఛార్జిల పోస్టులు దక్కాయి. ముగ్గురు ఎంపీలకు అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలు అప్పజెప్పారు.
మొత్తం నలుగురు వారసులు సెకండ్ లిస్ట్లో చాన్స్ దక్కించుకున్నారు. రామచంద్రపురంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు సూర్యప్రకాశ్, మచిలీపట్నంలో పేర్ని నాని కొడుకు కృష్ణమూర్తి (కిట్టు), తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ్ రెడ్డి, చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి అవకాశం దక్కించుకున్నారు.
రెండో జాబితాలో 11 మంది కొత్తవారికి చోటు కల్పించింది వైసీపీ అధిష్టానం. పోలవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు భార్య తెల్లం రాజ్యలక్ష్మీ టికెట్ దక్కించుకున్నారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్కు మొండి చేయి చూపిస్తూ .. పార్టీలో కొత్తగా చేరిన శాంతికి ఛాన్స్ ఇచ్చారు. ఎర్రగొండపాలెం నుంచి మంత్రి ఆదిమూలపు సురేష్ కు స్థాన చలనం జరిగింది. ఆ స్థానం తాటిపర్తి చంద్రశేఖర్ కు కేటాయించారు. పాయకరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే బాబూరావుకు మొండి చేయి చూపించి ఆ స్థానం కంబాల జోగులుకు కేటాయించారు. ఎంపీ మార్గాని భరత్ ఈసారి ఎమ్మెల్యేగా రాజమండ్రి సిటీ నుంచి బరిలోకి దిగనున్నారు. ఎంపీ వంగా గీత ఈసారి పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. అరకు ఎంపీ గొడ్డేటి మాధవి ఈసారి అరకు ఎమ్మెల్యేగా బరిలోకి దిగనున్నారు.
నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు వైసీపీకి ఎంత లాభం చేకూరుస్తుందో తెలియదు కానీ ప్రస్తుతం మాత్రం కొత్త తలనొప్పులను తీసుకొస్తోంది. బుజ్జగించినా అసమ్మతి రాగం డీటీఎస్ సౌండ్లో వినిపిస్తోంది.
మంత్రి గుడివాడ అమర్నాథ్తో ఉన్న విభేదాలు, వైసీపీ అధిష్టానం పట్టించుకోకపోవడం లాంటి కారణాలతో దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేశారు. అటు పూతలపట్టు ఎమ్మెల్యే MS బాబు జగన్పై సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీలో కేవలం దళితుల సీట్లు మాత్రమే మారుస్తున్నారని, అగ్రకులాల ఎమ్మెల్యేల సీట్లు మార్చడం లేదని ఆరోపించారు. విజయవాడ సెంట్రల్ ఇంచార్జ్గా వెల్లంపల్లిని నియమించడంతో మల్లాది విష్ణు అలకబూనారు.