Covid Update: తెలంగాణ కరోనా మళ్లీ పాగా వేసింది. కొత్తవేరియంట్ JN1 కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా ఆరోగ్యశాఖ విడుదల చేసిన కొవిడ్ బులెటిన్ లో తెలంగాణలో కొత్తగా 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాల్లోనే 6 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
కరీంనగర్ జిల్లాలో 4 పాజిటివ్ కేసులను గుర్తించారు. ఒక మహిళతో పాటు 18 నెలల బాలుడికి కరోనా పాజిటివ్ గా నిర్థారణయింది. మహబూబ్ నగర్ జిల్లాలో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో కొత్త వేరియంట్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
దేశంలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 600కు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ప్రస్తుతం భారత్ లో 4440 పాజిటివ్ కేసులున్నాయి. ఇక మంగళవారం ఒక్కరోజే 5 మంది కరోనాతో చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇప్పటివరకూ JN1 వేరియంట్ కేసులు 312 బయటపడ్డాయి. కేరళలో 147, గోవాలో 51, గుజరాత్ లో 34, మహారాష్ట్రలో 26, తమిళనాడులో 22, ఢిల్లీలో 16, కర్ణాటకలో 8, రాజస్థాన్ లో 5, తెలంగాణలో 2, ఒడిశాలో 1 కొత్తవేరియంట్ కేసులున్నాయి. 10 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలో కొత్తవేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది.