నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు వైసీపీకి ఎంత లాభం చేకూరుస్తుందో తెలియదు కానీ.. ప్రస్తుతం మాత్రం కొత్త తలనొప్పులను తీసుకొస్తోంది. సర్వేలు, చర్చోపచర్చలు, బుజ్జగింపులు చేసినా అసమ్మతి రాగం డీటీఎస్ సౌండ్లో వినిపిస్తోంది. ఇదే క్రమంలో అనకాపల్లిలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పార్టీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
మంత్రి గుడివాడ అమర్నాథ్తో ఉన్న విభేదాలు, వైసీపీ అధిష్టానం పట్టించుకోకపోవడం లాంటి కారణాలతో దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజీనామా లేఖను సీఎం జగన్తో పాటు ఇతర కీలక నేతలకు పంపినట్టు దాడి వీరభద్రరావు కుమారుడు దాడి రత్నాకర్ తెలిపారు. అంతేకాదు కుటుంబ సభ్యులతో కలిసి ఆయన టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. చంద్రబాబుతో ఇప్పటికే ఆయన భేటీ ఖరారైంది.
ఓ వైపు దాడి వీరభద్రరావు దాడి కొనసాగుతుండగానే.. జగన్పై మరో ఎమ్మెల్యే తిరుగుబాటు చేశారు. పూతలపట్టు ఎమ్మెల్యే MS బాబు జగన్పై సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీలో కేవలం దళితుల సీట్లు మాత్రమే మారుస్తున్నారని, అగ్రకులాల ఎమ్మెల్యేల సీట్లు మార్చడం లేదని ఆరోపించారు. తానేం తప్పు చేశానో జగన్ చెప్పాలన్న ఆయన.. తన సీటు ఎందుకు మారుస్తున్నారని ప్రశ్నించారు.
మరోవైపు అభ్యర్థుల ప్రకటనపై వైసీపీ అధినేత జగన్ చర్చోపచర్చలు జరుపుతున్నారు. రీజనల్ కోఆర్డినేటర్లు సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డితో భేటీ అయ్యారు. మరి ఈ మార్పులు వైసీపీలో ఎలాంటి రచ్చకు దారితీస్తాయో చూడాలి.
.
.