అటు ఏపీ ప్రభుత్వం, ఇటు అంగన్వాడీలు.. ఎవరికి వారు తగ్గేదేలే అంటున్నారు. సమ్మెను సైడ్కు పెట్టేసి గప్చుప్గా విధుల్లో చేరాలంటూ ప్రభుత్వం అల్టిమేటమ్ జారీ చేసింది. తమ జీతాలు పెంచుతూ బటన్ నొక్కపోతే వైసీపీ సర్కార్ అడ్రస్ గల్లంతయ్యే బటన్ తాము నొక్కుతామంటూ రివర్స్లో వార్నింగ్ ఇచ్చారు అంగన్వాడీలు. సై అంటే సై అన్నట్టుగా తయారైన పరిస్థితితో వివాదానికి ఫుల్ స్టాప్ ఎలా పడుతుందన్నది ఉత్కంఠ రేపుతోంది.
ఏపీలో అంగన్వాడీ వర్కర్ల సమ్మె ఉద్ధృతంగా సాగుతోంది. కనీస వేతనాలు, గ్రాట్యుటీ సహా తమ సమస్యల పరిష్కారం కోరుతూ గత 22 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలలో ఓట్ల కోసం హామీలు ఇచ్చింది మీరు కాదా? మీ మాటలను నమ్మి ఓట్లు వేస్తే.. ఇలా అన్యాయం చేస్తారా? అంటూ నిలదీస్తున్నారు ఉద్యోగులు. ప్రభుత్వం స్పందించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె ఆగదని తేల్చి చెబుతున్నారు.
అంగన్వాడీ కార్యకర్తలపై ఏపీ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. తక్షణం డ్యూటీలో చేరకుంటే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. ఎవరెవరు విధులకు హాజరు కావడం లేదో వివరాలు సేకరించాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే మంత్రుల ఇళ్లను సైతం ముట్టడించిన ఉద్యోగులు.. ఇప్పుడు డ్యూటీలో చేరకుంటే యాక్షన్ తప్పదని ప్రభుత్వం హెచ్చరించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
జగన్ వేతనాలు పెంచేలా బటన్ నొక్కాలి.. కాందంటే మేము మరో మూడు నెలల్లో నొక్కే బటన్తో వైసీపీ అడ్రస్ గల్లంతవుతుందంటూ వార్నింగ్ ఇస్తున్నారు అంగన్వాడీలు. జనవరి 3 తేదీలోగా ప్రభుత్వం తమ డిమాండ్లపై నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని అల్టిమేటం జారీచేశారు.
తాము ఇంతలా అవస్థలు పడుతుంటే.. మాపై కనీసం సీఎంకు కనికరం లేదా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల 10 వేల మంది కార్యకర్తలు సమ్మెలో ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంతో వ్యవహరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగిస్తామని తేల్చి చెబుతున్నారు.
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే సమ్మె సుఖాంతం అయ్యేందుకు ఛాన్స్ లు కనుమరుగయ్యాయి. అదే సమయంలో ప్రభుత్వం వారికి డెడ్ లైన్ విధించింది. ఈనెల 5 వతేదీ లోగా సమ్మె విరమించకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. గ్రాట్యుటీ విషయం తమ పరిధిలో లేదన్నది. తాజాగా జరిపిన చర్చలు కూడా విఫలం కావడంతో అంగన్వాడీలకు నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం.
ప్రభుత్వంతో పట్టుదలకు పోతే మొదటికే మోసం వస్తుందనే భయం కూడా వారిలో ఉంది. ఇప్పటికే అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టి, సచివాలయ సిబ్బందితో పనికానిచ్చేస్తోంది ప్రభుత్వం. పలు దఫాలు చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో చివరకు వార్నింగ్ ఇస్తూ అంగన్వాడీ సంఘాలకు నోటీసులు జారీ చేసింది. 5వతేదీలోగా విధుల్లో చేరాల్సిందేనని తేల్చి చెప్పింది. అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగులు ఎవరూ కూడా మెట్టు దిగేందుకు సిద్ధంగా కనిపించడం లేదు.
.
.