ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల తీరు టిడిపిని చిక్కుల్లో పడేస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకే పార్టీలో ఉంటూ రాజకీయ ప్రత్యర్ధుల్లా సవాళ్లు చేసుకుంటున్న అన్నదమ్ములు ఒక వైపు అయితే.. పార్టీ నాయకుల మధ్య ఆధిపత్యపోరు మరోవైపు పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారుతున్నాయంట. ఒకే పార్టీలో ఉంటూ బద్ద శత్రువుల్లా వారు తిట్టుకుంటున్న తీరుతో పార్టీ ప్రతిష్ట బజారుపాలవుతోందని కేడర్ తలలు పట్టుకుంటోంది.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీల్లో టికెట్ల ఆశిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. అన్ని నియోజకవర్గాల్లో ఒకరిద్దరు నాయకుల టికెట్లు కోసం పోటీ పడుతుంటే విజయవాడ పశ్చిమ టీడీపీలో మాత్రం ఏకంగా నలుగురు ఆశావహులు పోటీపడుతున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్టు తమదంటే తమదంటే ఎవరికి వారు ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ నాయకుల మధ్య పోటీ కాస్త పర్సనల్గా మారి.. తిట్ల దండకానికి దారి తీస్తోంది. ఆ క్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీ ఉత్తరాంధ్ర ఇన్చార్జ్గా కొనసాగుతున్న బుద్ధ వెంకన్న మధ్య మాటల యుద్ధం ఆదినాయకత్వం తలబొప్పి కట్టిస్తోందంట.
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పార్టీ కార్యాలయంలో మాట్లాడిన కేశినేని నాని తాను దోచుకోనని ఎవరిని దోచుకోనివ్వనని అంటూ.. కాల్ మనీ కొబ్బరి చిప్పల వారికి అవకాశం రాదు. రానివ్వనని పరోక్షంగా బుద్ద వెంకన్న వర్గంపై విమర్శలు గుప్పించారు. తాను విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం కాపలా కుక్కనని దోచుకొని, దాచుకునే వారిని వదిలి పెట్టె ప్రసక్తే లేదంటూ.. తన తమ్ముడు కేశినేని చిన్నిపై కూడా పరోక్ష కామెంట్స్ చేశారు
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ అధిష్ఠానం తనకే కేటాయిస్తుందని ఉత్తరాంధ్ర ఇన్చార్జ్గా ఉన్న మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న అంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో ఎక్కడా బీసీలకు సీటు లేదని.. కాబట్టి బీసీ కేటగిరీలో పశ్చిమ నియోజకవర్గ సీటు తనకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. బెజవాడ ఎంపీ టికెట్ కోసం కేశినేని నాని, ఆయన తమ్ముడు కేశినేని చిన్నిల మధ్య ఒకరకంగా యుద్దమే నడుస్తోంది. అలా పోటీపడుతున్న అన్నదమ్ముల్లో కేశినేని నానికి వ్యతిరేకంగా కేశినేని చిన్ని వెనుక ఉండి అన్ని బుద్ధ వెంకన్నే నడిపిస్తున్నారన్న ప్రచారం టిడిపిలో ఉంది.
కేశినేని నాని బుద్ధ వెంకన్న మధ్య వివాదం ఇప్పటిది కాదు. 2019 లో టిడిపి ఓటమి పాలైనప్పటి నుంచి వీరిద్దరి మధ్య విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. నాని, వెంకన్నల మధ్య కొద్దికాలం నడిచిన ట్వీట్ల వార్ ఇప్పుడు బహిరంగంగా సాగుతుంది. ఎన్నికల ముందు ఈ వివాదం టిడిపికి తలనొప్పిగా మారింది. ఇప్పటికే జనసేనతో పొత్తు వ్యవహారంతో సీట్ల సర్దుబాటు సవాలుగా మారింది టీడీపీకి.. ఇటు చూస్తే విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని దోపిడీ దారుల నుంచి కాపాడుకునే బాధ్యత తనదేనంటూ కేశినేని నాని ఘాటైన వ్యాఖ్యలు చేస్తుంటే .. బుద్దా వెంకన్న బీసీ సెంటిమెంట్తో టికెట్ కోసం డిమాండ్ చేస్తూ.. కేశినేనిని కూడా టార్గెట్ చేస్తుండటం.. టిడిపిలో దుమారాన్ని రేపుతోంది. ఈ పరిణామాలు చూస్తూపశ్చిమ నియోజకవర్గం లో టీడీపీ నేతల పోరుకు అధినాయకత్వం త్వరగా ఫుల్ స్టాప్ పెట్టాలని తెలుగు తమ్ముళ్లు కోరుకుంటున్నారు.
.
.