INDW Vs AUSW 3rd ODI: భారత్ లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు అదరగొట్టింది. మూడో వన్డేలో కూడా గెలిచి 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. ఛేజింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా అమ్మాయిలు 148 పరుగులకే ఆలౌట్ అయిపోయారు. 190 పరుగుల తేడాతో పరాజయం పాలయ్యారు.
నిజానికి భారత్ పిచ్ లపై విదేశీ ఆటగాళ్లు వచ్చి ఇలా ఆడటం చాలా అరుదైన విషయమనే చెప్పాలి. స్వదేశంలో జరుగుతున్న సిరీస్ లో టీమ్ ఇండియా అమ్మాయిలు ఇలా తేలిపోవడం ఆందోళన కలిగించే అంశమని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. జట్టులో సమతుల్యత లోపించిందని, బౌలింగ్ విభాగం వీక్ గా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మహిళా జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు ఫోబె లిచ్ఫీల్డ్ (119), అలిస్సా హీలీ (82) తొలి వికెట్కు రికార్డు స్థాయి భాగస్వామ్యం నమోదు చేశారు. 28.5 ఓవర్లలో 189 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తర్వాత గార్డనర్ (30), సదర్లాండ్ (23) , అలన కింగ్ (26) చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఆసిస్ 338 పరుగుల భారీ స్కోర్ చేసింది.
భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 3, అమన్జోత్ కౌర్ 2, దీప్తి శర్మ 1, పూజా వస్త్రాకర్ 1 వికెట్ పడగొట్టారు.
అసలు ఆసిస్ ఓపెనర్లు ఇద్దరు అలా నిలబడిపోవడమే మ్యాచ్ టీమ్ ఇండియా చేతిలోంచి జారిపోయింది. ఆ తర్వాత వచ్చినవాళ్లు కళ్లు మూసుకుని ఆడారు. ఎడాపెడా బాది పారేశారు. దాంతో భారీ స్కోరు టీమ్ ఇండియా అమ్మాయిల ముందు కనిపించింది. ఓవర్ కి ఆరు పరుగులు పైనే చేయాల్సిన దుస్థితిలో టీమ్ ఇండియా ఛేజింగ్ కి వచ్చింది.
ఒక ఓవర్ డిఫెన్స్ ఆడితే, రెండో ఓవర్ టార్గెట్ 12 పరుగులకు పెరిగిపోవడంతో ఒత్తిడిని భరించలేక, డిఫెన్స్ ఆడలేక చేతులెత్తేశారు. ముందు వికెట్లు కాపాడుకుని, చివర 20 ఓవర్లు చూసుకుందామనే తలంపు కూడా లేకుండా వీళ్లు కూడా ఎడా పెడా కొట్టి అవుట్ అయిపోయారు.
స్మృతి మంథాన (29) ఒక్కరే టాప్ స్కోరర్ గా నిలిచింది. కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ (3) ఈసారి కూడా తీవ్రంగా నిరాశ పరిచింది. రెండో వన్డేలో 96 పరుగులు చేసిన రిచాఘోష్ ఈసారి 19 పరుగులు మాత్రమే చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (25), దీప్తీ శర్మ (25 నాటౌట్), పూజా వస్త్రాకర్ (14) చేసి మమ అనిపించారు. చివరకు 32.4 ఓవర్లలో 148 పరుగులకు భారత్ కథ ముగిసిపోయింది. అలా 190 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
ఆస్ట్రేలియా బౌలర్లలో జార్జియా వేర్హామ్ 3, అలనా కింగ్, అన్నాబెల్ సదర్లాండ్, మేఘన్ స్కట్లు తలా రెండేసి వికెట్లు తీశారు.
ఏకైక టెస్ట్ మ్యాచ్ లో ఘనవిజయం సాధించిన టీమ్ ఇండియా వన్డేల్లో చిత్తుగా ఓడిపోవడంతో అందరూ తలలు పట్టుకున్నారు. ఇక జనవరి 5 నుంచి జరగనున్న మూడు టీ 20 మ్యాచ్ ల సిరీస్ లో ఎలా ఆడతారోననే ఆందోళన అప్పుడే అందరిలో మొదలైంది.