BCCI : 2023 జరిగిపోయింది. 2024 వచ్చింది. కాకపోతే ఈ ఏడాది పొడవునా కేవలం మూడు వన్డేలు మాత్రమే టీమ్ ఇండియా ఆడటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బీసీసీఐ రూపొందించిన మ్యాచ్ షెడ్యూల్ అందుకు ఉదాహరణగా నిలుస్తోంది. అందరూ టెస్ట్ క్రికెట్ ని మరిచిపోయారని తిట్టిపోస్తున్న నేపథ్యంలో వాటికి ప్రాధాన్యత ఇచ్చి, వన్డేలను వదిలేయడంతో బీసీసీఐపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
2024 జూన్ నెలలో పొట్టి ప్రపంచకప్ ప్రారంభంకానుంది. మరోవైపు ఐపీఎల్ అప్పుడే జరగనుంది. వెంటవెంటనే రెండూ అటూ ఇటూగా జరగనుండటంతో వాతావరణమంతా టెన్షన్ టెన్షన్ గా మారనుంది. మరి ఒక్కసారి టీమ్ ఇండియా 2024 షెడ్యూల్ చూసేద్దామా…
జనవరి 11 నుంచి జనవరి 17 వరకు ఆఫ్గనిస్తాన్ తో మూడు టీ20 మ్యాచులు జరుగుతాయి.
భారత్ వేదికగా జనవరి 25 నుంచి మార్చి 11 వరకు ఇంగ్లాండ్ తో 5 మ్యాచుల టెస్టు సిరీస్ జరగనుంది.
మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. రెండు నెలలు జరిగే ఐపీఎల్ మ్యాచ్ లు పార్లమెంట్ ఎన్నికల తర్వాత లేదా ముందు జరిగే అవకాశాలున్నాయి.
వెస్టిండీస్, అమెరికా వేదికగా జూన్ 4 నుంచి జూన్ 30 వరకు ఐసీసీ ప్రతిష్టాత్మక ట్రోఫీ 2024 టీ 20 వరల్డ్ కప్ జరగనుంది.
జులై నెలలో టీమిండియా శ్రీలంకలో పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటనలోనే 3 వన్డేలు ఆడనుంది. ఆ తర్వాత 3 టీ20 మ్యాచులు జరగనున్నాయి.
సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో భారత్ వేదికగా బంగ్లాదేశ్తో రెండు టెస్టులు, 3 టీ 20ల్లో టీమ్ ఇండియా తలపడనుంది.
అక్టోబర్-నవంబర్ నెలల్లో న్యూజిలాండ్ జట్టు భారత పర్యటనకు రానుంది. రెండు జట్ల మధ్య 3 టెస్టులు జరగనున్నాయి.
నవంబర్-డిసెంబర్ నెల్లలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరగనుంది. 5 టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు ఆస్ట్రేలియా వెళ్లనుంది. ఇక్కడితో 2024 షెడ్యూల్ ముగుస్తుంది.
ఏడాది మధ్యలోగానీ, తర్వాత గానీ షెడ్యూల్ లో ఏమైనా మార్పులుంటాయా? అంటే ఇంక ఉండకపోవచ్చునని అంటున్నారు. 2023–2025లో ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే టెస్ట్ మ్యాచ్ లకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని క్రీడా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.