A23A Iceberg : ప్రపంచం కళ్లన్నీ అటువైపే. ఏం జరగబోతుందా? అని శాస్త్రవేత్తల్లో ఒకటే టెన్షన్. ఆ అతిపెద్ద ఐస్బర్గ్ ఎటు కదులుతోందనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. దక్షిణ మహా సముద్రంలో నెమ్మదిగా కదులుతున్న ఏ23ఏ అనే ఆ మంచుకొండ ఏ తీరానికి చేరుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. 1986లో అంటార్కిటికా తీరం నుంచి ఈ ఐస్బర్గ్ విడివడింది. అక్కడ నుంచి కదిలి వెడ్డెల్ సముద్రం అడుగుకు చేరుకుని ఓ మంచుద్వీపంలా మారింది.
దాదాపు 37 ఏళ్ల అనంతరం ఆ మంచు కొండ వేగంగా కదలడం ఆరంభించింది. దాని విస్తీర్ణం దాదాపు 4000 చదరపు కిలోమీటర్లు. మన హైదరాబాద్ కన్నాఆరు రెట్లు, గ్రేటర్ లండన్ కన్నా రెండు రెట్లు పెద్దది. ఏ23ఏ ఐస్బర్గ్ మందం దాదాపు 1312 అడుగులు. నీటి ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్ల సముద్రంలో ఉన్న మంచుకొండలో నిరుడు కదలిక ఆరంభమైనట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్రస్తుతం అది సదరన్ ఓషన్లో ఈశాన్య దిశగా కదులుతోంది. సబ్-అంటార్కిటిక్ రీజియన్లోని సౌత్ జార్జియాకు సమీపిస్తుండటం శాస్త్రవేత్తల్లో ఉత్కంఠకు కారణమవుతోంది.
సౌత్ జార్జియా దీవి జీవవైవిధ్యానికి పెట్టింది పేరు. విభిన్నమైన సముద్రజీవులకు ఆలవాలం. సీబర్డ్స్కు అతి పెద్ద ఆవాసం. ఏ23ఏ లాంటి మంచుకొండ ఆ దీవిని తాకితే వినాశకరమైన మార్పులు తప్పవనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ భారీ మంచుకొండను ట్రాక్ చేస్తుండటమంటే.. శాస్త్రవేత్తలు సరికొత్త పాఠాలు నేర్చుకున్నట్టే. సముద్రాల్లో ఐస్బర్గ్ల ప్రయాణం, జనావాస తీరాలకు చేరితో కలిగే మార్పులు ఏమిటన్న అంశాలపై విస్తృత అధ్యయనం చేసే వీలు కలుగుతుంది.
ఒకవేళ సౌత్ జార్జియాకే ఈ మంచుకొండ చేరుతుందని అనుకుంటే.. అక్కడి జీవులకు పెనుముప్పే. ఆ ద్వీపంలో సంతానోత్పత్తి చేసే లక్షల కొద్దీ సీల్స్, పెంగ్విన్, ఇతర సముద్ర పక్షులు ప్రతికూల పరిస్థితులను చవిచూసే అవకాశం ఉంది. ఐస్ బర్గ్ భారీ సైజు దృష్ట్యా అది అక్కడ నివసించే జంతువుల ఆహార సేకరణ మార్గాలకు ఆటంకం ఏర్పడొచ్చు. ఎంత పెద్ద ఐస్ బర్గ్ అయినా చివరకు క్రమంగా కరిగిపోయి.. నీటిలో కలిసిపోతుంది. ఏ23ఏ విషయంలో అదే జరిగితే.. సౌత్ జార్జియా దీవి ఏమవుతుందా? అనే ఆందోళన వ్యక్తమవుతోంది.