Cybercrimes : సైబర్ నేరగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రోజురోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి తప్ప కట్టడి కావడం లేదు. సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది. గత 8 నెలల్లో నేరగాళ్లు ఏకంగా 700 కోట్లు కొల్లగొట్టారు. దీంతో.. పోలీసులు కూడా నేరాలను అడ్డుకోవడానికి కొత్త ఆలోచనలు చేస్తున్నారు. సోషల్ మీడియాపై నిఘా పెంచి మోసగాళ్ల ఆటలు కట్టించాలని పోలీసులు భావిస్తున్నారు.
2022తో పోలిస్తే 2023లో క్రైమ్ రేట్ 8.97శాతం పెరిగింది. సైబర్ క్రైమ్ అయితే ఏకంగా 17.59శాతం పెరిగింది. 2022లో తెలంగాణలో 15, 297 సైబర్ నేరాలు నమోదయ్యాయి. ఆ ఏడాది దేశంలో తెలంగాణలోనే ఎక్కువ కేసులు వెలుగు చూశాయి. ఈ పరిస్థితిని గుర్తించి పోలీసులు ముందు జాగ్రత్తలు మొదలు పెట్టారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేశారు. దోపిడీకి గురైన వారి డబ్బును రికవరీ చేయడానికి ఈ బ్యూరో కృషి చేస్తోంది. నేరం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే ముందు.. అసలు నేరమే జరగకుండా ఆపాలంటే ఏం చేయాలనేదానిపై కూడా పోలీసులు ఫోకస్ చేశారు. దీని కోసం సోషల్ మీడియాలో క్రైం చేస్తున్న సైబర్ నేరగాళ్లను వేటాడేందుకు వ్యూహం సిద్ధం చేస్తున్నారు.
ఒకప్పుడు సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్తో నేరాలకు పాల్పడేవారు. దీనిపై నెటిజన్లకు ఓ అవగాహన వచ్చింది. దీంతో.. నేరగాళ్లు రూట్ మార్చారు. నకిలీ వ్యాపార సంస్థలు సృష్టించి బిజినెస్ పేరుతో గాలం వేస్తున్నారు. తమ సంస్థ తరఫున వ్యాపారం చేస్తే.. మంచి కమీషన్ ఇస్తామని నమ్మించి లక్షల రూపాయలు పెట్టుబడిగా గుంజుతున్నారు. ఇలాంటి మోసాలు ఇటీవల భారీగా పెరిగాయి. దీంతో.. పోలీసులు సోషల్ మీడియాలోని ఇలాంటి వ్యాపార ప్రకటనలపై దృష్టి పెడుతున్నారు. ప్రకటనలు చేస్తున్న కంపెనీల పుట్టు పూర్వత్తరాల గురించి ముందుగానే ఆరా తీస్తున్నారు. కంపెనీ సమాచారంలో అనుమానాలు ఉంటే.. వాటిపై చర్యలకు సిద్దమవుతున్నారు. అవి ఫేక్ కంపెనీలు అని తీలితే.. ప్రజలను సోషల్ మీడియా ద్వారా అప్రమత్తం చేస్తున్నారు.