అలాస్కా తీరంలో భారీ పేలుడు ముప్పు తప్పింది. లిథియం ఐయాన్ బ్యాటరీలతో ఉన్న భారీ నౌకలో మంటలు చెలరేగాయి. బ్యాటరీల వల్ల బారీ పేలుడు సంభవించే ప్రమాదం ఉన్నందున ఐదు రోజుల క్రితమే కార్గో షిప్ జీనియస్ స్టార్-11ను డచ్ హార్బర్కు దూరంగా పసిఫిక్ సముద్రంలోనే నిలిపివేశారు. ఎట్టకేలకు ఆ మంటలను అదుపులోకి తీసుకురావడంతో భారీ పేలుడు ప్రమాదం తప్పినట్లయింది.
రవాణా నౌకలోని 19 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. మంటలు వ్యాప్తి చెందకుండా మెరైన్ ఫైర్ ఫైటింగ్ బృందం పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. వియత్నాం నుంచి శాన్డీగోకు లిథియం ఐయాన్ బ్యాటరీలను జీనియస్ స్టార్ నౌకలో తరలిస్తున్నారు. ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బ్యాటరీల కారణంగా పేలుడు సంభవించే అవకాశం ఉండటంతో.. మంటలు చెలరేగిన వెంటనే కోస్ట్ గార్డులను నౌకా సిబ్బంది అప్రమత్తం చేసింది.
మంటలు వ్యాప్తి చెందకుండా వారు వెంటనే చర్యలకు ఉపక్రమించారు. కార్బన్-డై-ఆక్సైడ్ సాయంతో వాటిని ఆర్పే ప్రయత్నం చేశారు. 410 అడుగుల ఎత్తైన కార్గోషిప్ను డచ్ హార్బర్కు సుదూరంగా నిలిపివేశారు. ఇది నిత్యం రద్దీగా ఉండే షిఫింగ్ హార్బర్. మంటల వల్ల బ్యాటరీలు పేలి విషవాయువులు వెలువడే అవకాశం ఉండటంతో ఈ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. మంటల వల్ల ఆయిల్ లీక్ వంటివేవీ చోటుచేసుకోలేదని నౌక యాజమాన్యం విజ్డమ్ మెరైన్ గ్రూప్ వెల్లడించింది.