విశాఖలో గ్యాంగ్రేప్ కేసులో 11 మంది నిందితులను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసును మహిళా కమిషన్ సుమోటోగా తీసుకోవడంతో.. దర్యాప్తు వేగవంతం చేశారు. ఘటనపై విశాఖ సీపీ రవిశంకర్ సీరియస్ అయ్యారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా విశాఖలోని లాడ్జీల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.
విశాఖ గ్యాంగ్ రేప్ ఘటనతో బీచ్లో సేఫ్టీపై చర్చ సాగుతోంది. 17 ఏళ్ల బాలికపై అత్యాచారం ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బీచ్లో సేఫ్టీపై ఆందోళన మొదలైంది. ఒడిశా నుంచి వచ్చి విశాఖలో పని చేసుకుంటున్న బాలికపై ప్రియుడు, స్నేహితుడు అత్యాచారం చేయడంతో.. బీచ్లో ఆత్మహత్యకు వెళ్లిన బాలికను మాయమాటలతో ఫొటోగ్రాఫర్ 8 మందితో కలిసి గ్యాంగ్ రేప్ చేయడం మహిళలను కలవరపెడుతోంది. విశాఖ బీచ్కు ఏడాది పొడవునా పర్యాటకులు పోటెత్తి వస్తుంటారు. మరి అలాంటి వారికి సేఫ్టీ ఏంటనే భయం పట్టుకుంది. అయితే.. ఈ ఘటనతోనైనా అధికారులు అలర్ట్ అవుతారా..? కామాంధులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు..? బీచ్లో ఎలాంటి ఆంక్షలు విధించనున్నారన్నది ప్రస్తుతం ఆసక్తి రేపుతున్న అంశం.
విశాఖ జిల్లాలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విస్తృతంగా గాలింపు చేపట్టారు. మొత్తం 13 మంది నిందితులకుగాను 11 మందిని అరెస్ట్ చేశారు. మిగిలిన ఇద్దరి కోసం ఝార్ఖండ్, విశాఖ నగరాల్లో గాలిస్తున్నారు. కాగా.. ఈ ఘటనపై మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సీరియస్ అయ్యారు. కేసును సుమోటోగా స్వీకరించిన ఆమె.. సమగ్ర విచారణ చేపట్టాలని, ఘటన పూర్తి వివరాలు తెలియజేయాలని విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్కు లేఖ రాశారు. నిందితులకు కఠిక శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని.. బాధిత బాలిక వివరాల గోప్యత పాటించడంతో పాటు వైద్య సదుపాయం, రక్షణ కల్పించాలని ఆదేశించారు.
దేశంలో మహిళల కోసం ఎన్ని చట్టాలు రూపొందించినా కామాంధులు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. ఏ చట్టానికి జంకడం లేదు. ఎన్కౌంటర్ లాంటి వాటికి బెదరడం లేదు. ఆడపిల్లలు తమ కోసమే అన్నట్టు ప్రేమ పేరుతో కొందరు నమ్మించి మోసం చేస్తుంటే.. స్నేహం పేరుతో మరికొందరు కామంతో కాటేస్తున్నారు. ఇలాంటి ఓ దారుణ ఘటనే ఏపీలో చోటు చేసుకుంది. ఒకరు ఇద్దరు కాదు.. ఏకంగా 10 మంది గ్యాంగ్ రేప్ చేసి మానవ మృగాలు అనిపించుకున్నారు. విశాఖలో 17 ఏళ్ల దళిత బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. తొలుత ప్రియుడు, ఆ తర్వాత అతని స్నేహితుడు అత్యాచారం చేయగా.. అనంతరం మరో 8 మంది బాలికను హోటల్ గదిలో నిర్భంధించి రెండ్రోజులపాటు అత్యాచారానికి పాల్పడ్డారు.
ఒడిశాకు చెందిన ఓ కుటుంబం విశాఖ కంచరపాలెంలో నివసిస్తోంది. ఈ ఇంట్లోని బాలిక రైల్వే న్యూకాలనీలో ఓ ఇంట్లో కుక్కలకు ఆహారం పెట్టే పనికి కుదిరింది. బాలికకు భువనేశ్వర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈ నెల 18న ఆమెను ప్రియుడు నాల్గో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక హోటల్ కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తన స్నేహితుడినీ రప్పించి అఘాయిత్యానికి పాల్పడేలా చేయించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఆర్కే బీచ్కు వెళ్లింది. అక్కడ చనిపోదామని ఏడుస్తూ కూర్చొని ఉండగా.. పర్యాటకుల ఫొటోలు తీసే ఓ వ్యక్తి ఆమెను ఓదార్చాడు. తనను ధైర్యం చెప్పినట్లు నటించి జగదాంబ కూడలి సమీపంలోని లాడ్జికి తీసుకెళ్లాడు. అక్కడ బంధించాడు. అతనితో సహా 8 మంది రెండురోజులపాటు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.
భయాందోళనకు గురైన బాలిక వారి చెర నుంచి తప్పించుకుని ఒడిశాలోని కలహండి జిల్లాలో ఉన్న స్వగ్రామానికి వెళ్లిపోయింది. ఇంటినుంచి బాలిక వెళ్లిన 18వ తేదీనే అదృశ్యం కేసు నమోదు చేసిన నాల్గో పట్టమ పోలీసులు 22న ఆమెను గుర్తించి ఇక్కడి ఇంటికి చేర్చారు. మానసిక ఆందోళన, భయంతో ఆదివారం వరకు బాలిక తనకు జరిగిన అన్యాయాన్ని తల్లిదండ్రులతో పంచుకోలేకపోయింది. తాను పడ్డ బాధలను ఆదివారం(డిసెంబర్ 31) చెప్పడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. నగరానికి చెందిన 11 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాలిక ప్రియుడు, అతడి స్నేహితుడు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి ఝార్ఖండ్, విశాఖ నగరాల్లో గాలిస్తున్నారు.