తెలంగాణలో మహాలక్ష్మీ పథకానికి మంచి స్పందన వస్తోంది. దీంతో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. అయితే.. ప్రయాణికులకు తగ్గ బస్సులు లేక ఇబ్బందులు పడుతున్న గ్రేటర్ హైదరాబాద్ మహాలక్ష్ముల కోసం.. బస్సులను పెంచే ప్రయత్నంలో ఉంది ఆర్టీసీ బృందం. ఇందుకుగాను మరో 880 సిటీ బస్సుల కోసం సన్నాహాలు చేస్తోంది.
గ్యారెంటీ స్కీంలోని మహాలక్ష్మీ పథకంతో గ్రేటర్ హైదరాబాద్ జోన్లో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. రోజూ 9 నుంచి 10 లక్షలు మించని ప్రయాణాలతో ఉన్న జోన్లో.. ఉచిత బస్సు పథకం అమలు నాటి నుంచి ప్రస్తుతం రోజూ 18 లక్షల మంది సిటీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఇందులో మహిళా ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. గతంలో 4.50 లక్షల మంది ప్రయాణిస్తుంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 10 లక్షలు దాటింది. మహాలక్ష్మి పథకంతో దాదాపు 2.50 కోట్ల మంది మహిళా ప్రయాణికులు సిటీ బస్సుల్లో గమ్యస్థానాలకు చేరారని టీఎస్ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే బస్సుల సంఖ్యను పెంచుకునే పనిలో పడ్డారు ఆర్టీసీ అధికారులు.
నగరంలో ప్రస్తుతం 2850 బస్సులు తిరుగుతుండగా.. ప్రయాణికుల రద్దీ దృష్యా అదనంగా 1100ల బస్సులు అవసరమని అధికారులు భావిస్తున్నారు. అందులో 880 బస్సులు వెంటనే ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. వీటిలో 540 బస్సులు టీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు కాగా.. మరో 340 బస్సులు అద్దె ప్రాతిపదికన సమకూర్చుకోవడానికి ఇటీవల టెండర్లను పిలిచింది. 340 బస్సులకు టెండర్లు జనవరి 3తో ముగియనుండగా.. ఇటీవల ప్రీబిడ్డింగ్ సమావేశం ఏర్పాటు చేస్తే మంచి స్పందన వచ్చిందని.. జూలై నాటికి కొత్తగా 880 బస్సులు సమకూరుతాయని చెబుతున్నారు అధికారులు. అద్దె ప్రాతిపదికన బస్సులు తక్కువైతే సొంతంగా సమకూర్చుకోవాలనే యోచనలో ఉంది ఆర్టీసీ.