Mahbubnagar : విద్యార్థులంతా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న వేళ.. ప్రభుత్వ మైనార్టీ గురుకుల కళాశాలలో ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానిక సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం భూనీడు గ్రామనికి చెందిన హన్మంత్ రెడ్డి అనే వ్యక్తి కుమారుడు రాంరెడ్డి(17) మహబుబ్ నగర్ ప్రభుత్వ మైనార్టీ గురుకుల కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం రాత్రి స్టడీ అవర్ జరుగుతుండగా ఐదో అంతస్తులో ఉన్న తన గదికి వెళ్లి పడుకున్నాడు.
తెల్లవారుజామున 3.31 గంటలకు రాంరెడ్డి పడుకున్న గది నుంచి రెండో అంతస్తులో ఉన్న గదికి వెళ్ళాడు. తలుపు గడియ పెట్టుకున్నాడు. గదిలోని సీసీ కెమెరా పైకి తిప్పాడు. తర్వాత గదిలో రాంరెడ్డి టవల్ తో ఫ్యానుకు ఉరేసుకున్నాడు. కళాశాల సిబ్బంది గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు అని సీఐ తెలిపారు.
కాగా.. విద్యార్థి తల్లిదండ్రులు , బంధువులు తమకు న్యాయం చేయాలంటు కళాశాల దగ్గర ఆందోళనకు దిగారు. విద్యార్థి తండ్రి.. తమ కుమారుడి మెడ వద్ద గాయాలు ఉన్నాయని.. ఈ విషయం పై స్పష్టత ఇవ్వాలని కోరాడు. తమ కుమారుడి మృతికి కారణం అయిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. రాంరెడ్డి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.