Shubman Gill : కొత్త సంవత్సరం ప్రారంభోత్సవం నాడు చాలామంది కొత్త కొత్త ఆలోచనలు, ప్రణాళికలతో ముందడుగు వేస్తుంటారు. అలాగే తమకి పాత సంవత్సరంలో ఎదురైన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని, కొత్త సంవత్సరంలో అలాంటివి చేయకూడదని గట్టిగా అనుకుంటారు. అలాంటి వారి కోవలోకి టీమ్ ఇండియా యువ క్రికెటర్ శుభ్ మన్ గిల్ కూడా చేరారు.
తను 2023లో ఏం నిర్ణయాలు తీసుకున్నాడు? ఏం సాధించాడు? వాటిని ఒక చిన్న తెల్ల కాగితంపై రాసి ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. అదిప్పుడు నెట్టింట వైరల్ అయి కూర్చుంది. ఇంతకీ తనేం రాశాడంటే..
ఏడాది క్రితం రాసుకున్నవాటిలో మనమేం సాధించామన్నది చూసుకుంటే ఎన్నో అనుభవాలను నేర్పిందని అన్నాడు. అలాగే సరికొత్త పాఠాలు నేర్చుకున్నానని తెలిపాడు. వరల్డ్ కప్ దగ్గరికి వచ్చేసరికి చాలా నిరాశ చెందామని అన్నాడు. ఆ ఓటమిని తలచుకుంటే ఇప్పటికి నా మనసు కుదురుండదని రాసుకున్నాడు. అంతగా వరల్డ్ కప్ పై మనసుపెట్టి ఆడామని తెలిపాడు. కాకపోతే చివర్లో మాత్రం అంత సాఫీగా సాగలేదని అన్నాడు.
కొత్త ఏడాదిలో మరిన్ని కఠిన పరీక్షలను ఎదుర్కొనేందుకు, అపజయాల నుంచి జయాల వైపు వెళ్లడానికి శాయశక్తులా కృషి చేస్తానని తెలిపాడు. అభిమానులకు మరింత ఆనందాన్ని పంచుతామని అన్నాడు. మాతో పాటు భారతీయులందరికీ కూడా మంచి జరగాలని, వారికి జీవితంలో ఉన్నత స్థానాలను, లక్ష్యాలు చేరుకోవడానికి తగిన శక్తియుక్తులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపాడు.
2023లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా గిల్ నిలిచాడు. అయితే అనూహ్యంగా ఇటీవల ఫామ్ కోల్పోయి అతి తక్కువ పరుగులకి అవుట్ అయి, అభిమానులను నిరాశ పరుస్తున్నాడు. టీమ్ మేనేజ్ మెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేక పోతున్నాడు.
ఎన్ని జరిగినా గిల్ కి కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ మద్దతు ఉండటం తనకి కలిసి వచ్చే అంశమని చెప్పాలి. రేపు సౌతాఫ్రికాతో జరగనున్న రెండో టెస్ట్ లో ఒక సెంచరీ గానీ గిల్ చేస్తే, మాట్లాడే వారి నోళ్లన్నీ మూసుకుంటాయని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. మరేం చేస్తాడో వేచి చూడాల్సిందే.