AP Assembly Elections 2024 : ఏపీలో ఈసారి గెలవాల్సిందే. టీడీపీ అధినేత చంద్రబాబు అందుకు తగ్గట్లే వ్యూహాలు రెడీ చేశారు. అయితే అధికారంలో ఉన్న జగన్ ను తట్టుకుని నిలబడి గెలవడం కీలకంగా మారింది. తెలుగుదేశం పార్టీకి 2024 అసలు సిసలైన పరీక్ష పెడుతోంది. నిజానికి ఏపీ ప్రజలు ఐదేళ్లకో ప్రభుత్వాన్ని మార్చేలా తీర్పు ఇస్తున్నారు. 2014లో టీడీపీని గెలిపిస్తే.. 2019లో వైసీపీకి అధికారం కట్టబెట్టారు. ఇప్పుడు 2024లో మరి ఎవరి వంతు?
గెలుపు వ్యూహాల్లో టీడీపీ బిజిబిజీగా ఉంటోంది. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా చూసుకుంటామని ఇప్పటి నుంచే హామీల డోసు పెంచేస్తోంది తెలుగుదేసం పార్టీ. నిజానికి టీడీపీకి ఈ గెలుపు చాలా ముఖ్యం. లేకపోతా చాలా చాలా నష్టం అన్న వాదన కూడా ఉంది. అందుకే ఈసారి ఎక్కడా తగ్గకుండా వ్యవహారం నడుపుతున్నారు చంద్రబాబు. సంక్షేమంతో ప్రజల ఆర్థిక స్థితిగతులు పెరగడం మంచిదే. అదే సమయంలో అభివృద్ధి, మౌలిక వసతులు కూడా ముఖ్యమే. ఏపీ ఓటర్లు కీలకమైన ప్రజా తీర్పులు ఇస్తున్నారు. ప్రతి ఐదేళ్లకు ట్రెండ్ మారుస్తున్నారు. 2014లో చంద్రబాబు విజన్ కు జై కొట్టారు. 2019లో మాత్రం జగన్ నవరత్నాలకు మొగ్గు చూపారు. 2024 ఎన్నికల్లో ఎటువైపు ఆసక్తి చూపుతారన్నది ఉత్కంఠగా మారుతోంది.
ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగు దేశం పార్టీ మరోసారి ఓటమిని ఎదుర్కోడానికి ఏమాత్రం సిద్ధంగా లేదు. ఇప్పటికే ఇదేం ఖర్మ రాష్ట్రానికి పేరుతో చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలు చేస్తున్నారు. రాయలసీమ, ఆంధ్రా, ఉత్తరాంధ్రల్లో చంద్రబాబు పర్యటనలు ఆ పార్టీలో ఉత్సాహాన్ని నింపాయి. మధ్యలో స్కిల్ కేసులో అరెస్ట్ అవడం ఒక్కసారిగా ఏపీ పాలిటిక్స్ లో అలజడి రేపింది. ప్రస్తుతం చంద్రబాబు తనకు ఒక్క అవకాశం ఇవ్వాలంటున్నారు. 2029 నాటికి చంద్రబాబు వయసు 80 ఏళ్లు అవుతుంది. ప్రస్తుతం అమరావతి ఇష్యూను భుజాన మోస్తున్నారు. అయితే ఈ ఎఫెక్ట్ వర్కవుట్ అవుతుందా చూడాలి.
జగన్ గెలిస్తే సంక్షేమ పాలననే ప్రజలు కోరుకుంటున్నారని అర్థం. చంద్రబాబు గెలిస్తే ప్రజలు మార్పును ఇష్టపడుతున్నారని, కేవలం సంక్షేమ పథకాలు ప్రజలను తృప్తి పరచలేదని అర్థం. మరి ఈ రెండిట్లో జనం ఎటువైపు మొగ్గు చూపుతున్నారన్నది మరికొద్ది నెలల్లో తేలనుంది. అందుకే ఈ 2024 ఏపీ పొలిటికల్ పార్టీలకు టెస్టింగ్ టైం. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ భవిష్యత్కి 2024 కీలకం. 2019లో ఘోర పరాజయం పాలైన తర్వాత ఐదేళ్లుగా చాలా సమస్యలను ఎదుర్కొంది టీడీపీ. అన్నింటిని తట్టుకొని నిలబడి ఇప్పుడు 2024 అసెంబ్లీ ఎన్నిక్లలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తోంది. 2023 ఏడాదిని టీడీపీ ఎప్పటికీ మర్చిపోలేని సంవత్సరంగా మారిపోయింది. ఎందుకంటే… చంద్రబాబు కేసుల్లో ఇరుక్కుని జైలుకు వెళ్లిన సందర్భం అదే. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీలోని పేరున్న లీడర్లంతా కేసులతో సతమతమైన వాళ్లే.
తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలు కచ్చితంగా జీవన్మరణ సమస్యగా మారిపోయాయి. ఆరునూరైనా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే అంది వచ్చిన ఏ అవకాశాన్ని కూడా విడుచుకోకుండా జాగ్రత్త పడుతోందా పార్టీ. ఇప్పటికే జనసేనతో పొత్తు కుర్చుకుంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని భారీ వ్యూహన్ని రచిస్తోంది. ఇప్పటివరకు సోషల్ మీడియా ఇతర మాధ్యమాల ద్వారా జనసేనతో పొత్తుపై పాజిటివ్ వాతావరణం తీసుకొచ్చిన టీడీపీ దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. ముఖ్యంగా సీట్ల వ్యవహారంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ అందరిలో ఉంది. ఒక వేళ బీజేపీ కూడా కలిసి వస్తే పరిస్థితి ఏంటనే డిస్కషన్ కూడా జరుగుతోంది. సీట్ల విషయంలో జనసేన కేడర్కు భారీగా డిమాండ్లు ఉన్నాయి. వాటిని రెండు పార్టీల అధినాయకత్వాలు ఎలా స్వీకరిస్తాయన్నది కూడా కీలకంగా మారింది. చెప్పాలంటే టీడీపీకి రాబోయే రెండు మూడు నెలలు చాలా కీలకం.
సీట్ల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకపోతే.. ఆ తర్వాత ఓట్ల మార్పిడి ఈజీగా జరుగుతుందన్న నమ్మకంతో ఉన్నారు. కొందరు వైసీపీ అసంతృప్త నేతలు జనసేనవైపు చూస్తున్నారు. ఇలాంటి సందర్భంలో వారికి టికెట్లు ఇవ్వాల్సి వస్తే టీడీపీ ఏం చెప్పనుందో అన్న చర్చ నడుస్తోంది. ఈ మధ్యే జనసేనలో జాయిన్ అయిన వంశీకృష్ణ తనకు కచ్చితంగా టికెట్ వస్తుందని ఆశతో ఉన్నారు. ఇలాంటి వాళ్లు జనసేనలో చాలా మంది జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నారంటున్నారు. వారిని ఎలా సర్దుబాటు చేస్తారనేది పెద్ద్ క్వశ్చన్ మార్క్. ఇది జనసేన సొంత వ్యవహారం అయినప్పటికీ అది టీడీపీపై ఎఫెక్ట్ పడుతుంది. అటు టీడీపీలో కూడా 175 నియోజకవర్గాల్లో ఆశావాహులు ఉన్నారు. జనసేనకు ఇచ్చిన టికెట్లలో టీడీపీ వాళ్లను ఎలా శాంత పరిచి ఓటు షేర్ అయ్యేలా చేస్తారనేది పెద్ద టాస్కే.
సంక్షేమం పేరుతో అనేక పథకాలు తీసుకొచ్చిన జగన్ అవే తనకు ఓట్ల వర్షం కురిపిస్తాయని నమ్ముతున్నారు. అయితే ఆ ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకునేలా టీడీపీ అధినేత చంద్రబాబు ఏం చేయబోతున్నారనేది కీలకంగా మారుతోంది. ఇప్పటికే 5 గ్యారంటీల పేరుతో మహిళలకు ఉచిత ప్రయాణం, నెలకు 2500 నిధులు ఇవ్వాలని, 4 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామంటున్నారు. దీంతో ఎన్నికల మ్యానిఫెస్టో సంక్షేమం, అభివృద్ధి సమ్మిళితంగా ఉండబోతోందన్న క్లారిటీ ఇచ్చేశారు. దీంతో సంక్షేమ ఫలాల కోసం చూసే వారు టీడీపీవైపు షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు. వీటికి తోడు లోకేష్ పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలు, స్థానికంగా నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలతో మ్యానిఫెస్టో రెడీ చేసే ప్లాన్ తో ఉన్నారు.
చంద్రబాబును గతంలో ఎప్పుడూ లేనంతగా కేసులు వెంటాడుతున్నాయి. గతేడాది నుంచి జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. సుమారు 2 నెలల తర్వాత బెయిల్ వచ్చింది. మిగతా కేసుల్లో ఆయన పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది. వచ్చే ఎన్నికల్లో రిజల్ట్స్ ఆధారంగా వీటి కదలిక ఉంటుంది. అందుకే ప్రజలను మెప్పించి అధికారం కైవసం చేసుకోవాల్సిన తక్షణావసరం కనిపిస్తోంది. జనవరి 5 నుంచి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో సమావేశాలు పెట్టనున్నారు. అదే టైంలో లోకేష్ కూడా జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. పాదయాత్రలో కవర్ చేయని నియోజకవర్గాలను టచ్ చేయబోతున్నారు. ఇటు చంద్రబాబు టూర్, మరోవైపు లోకేష్ పర్యటన. రెండింటినీ మేనేజ్ చేసుకొని ప్రజలను మెప్పిండానికి టీడీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. చెప్పాలంటే టీడీపీకి 2024 సంవత్సరం జీవన్మరణ సమస్య.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ ఇస్తున్నారనే ప్రచారం వైసీపీలో ఎంత టెన్షన్ పెడుతోందో తెలుగుదేశం పార్టీకి అంతే ఇబ్బందికరంగా మారుతోంది. ఒక వేళ షర్మిల కాంగ్రెస్లోకి వెళ్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలేందుకు ఛాన్స్ ఉంటుంది. దీన్ని కట్టడి చేయడానికి ప్రతి వ్యూహం ఎలా రచిస్తారనేది ఆసక్తిగా మారుతోంది. మరోవైపు బీజేపీ కూడా ఏపీ రాజకీయాల్లో కీ రోల్ పోషించాలని అనుకుంటోంది. అందుకు తగ్గట్లే ఎన్నికల ముందు ఇటీవలే ఏపీ బీజేపీ అధ్యక్షురాలి పురంధేశ్వరిని నియమించారు. ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్షాల పరిస్థితి ఎలా ఉందంటే… టీడీపీ జనసేన కలిసి పోటీ చేయాలని డిసైడ్ అయ్యాయి. అటు జనసేన బీజేపీతో పొత్తులో ఉంది. ఈ మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తాయని ఎప్పటి నుంచో ప్రచారం సాగుతోంది. దీనిపై ఢిల్లీ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయంటున్నారు. దీంతో బీజేపీ విషయంలో టీడీపీ ఎలాంటి స్టెప్ తీసుకోనుందన్నది చర్చనీయాంశంగా మారింది. అటు బీజేపీ అడుగులు ఏంటన్నది కూడా కీలకమే.
ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో వైఎస్సార్సీపీని గెలవనివ్వమని పవన్ కళ్యాణ్ పదేపదే చెబుతున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వమని తేల్చి చెబుతున్నారు. బీజేపీ కలిసి వస్తుందనే ధీమాతో ఉన్నారు. ఒకవేళ పొత్తులు కుదిరితే… సీట్ల పంపకం ఆ మూడు పార్టీల మధ్య సవాల్ గా మారడం ఖాయంగా కనిపిస్తోంది. చెప్పాలంటే 2024 ఏపీ పాలిటిక్స్ ను పార్టీల భవిష్యత్ ను ఏపీ ఫ్యూచర్ ను డిసైడ్ చేయబోతోంది.