Numaish Exhibition : హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నుమాయిష్ ప్రారంభమైంది. ఈ ఎగ్జిబిషన్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నుమాయిష్లో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వ్యాపార వేత్తలు పాల్గొంటారని సీఎం తెలిపారు.
పదేళ్లుగా పేరుకుపోయిన సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. హైదరాబాద్ అంటే చార్మినార్, ట్యాంక్ బండ్, నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తొస్తాయని పేర్కొన్నారు. నుమాయిష్లో ఎన్నో కళలకు సంబంధించిన వస్తువులు సైతం ప్రదర్శించడం ఎంతో అభినందనీయమన్నారు. నుమాయిష్ కమిటీ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలకు తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. పదేళ్లుగా పేరుకుపోయిన సమస్యలు అన్నీ పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
నుమాయిష్ కమిటీలో మహిళల ప్రాతినిథ్యం అభినందనీయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పారిశ్రామిక రంగంలో మహిళలకు మరింత ప్రోత్సాహం అందిస్తామని ప్రకటించారు. నునాయిష్కు వచ్చే వ్యాపారులకు, ప్రజలకు ఏలాంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లను నుమాయిష్ కమిటీ సన్మానించింది.
రాష్ట్రానికి నుమాయిష్ గర్వకారణంగా నిలుస్తోందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. స్వాతంత్య్రం రాక ముందు నుంచి ఎంతో మంది పారిశ్రామిక వేత్తలు, డాక్టర్లు, ఇంజినీర్లు, పలు సంస్థలు నుమాయిష్ను ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్నారని చెప్పారు. 30 వేల మంది విద్యార్థులు ఎగ్జిబిషన్ సొసైటీకి చెందిన విద్యా సంస్థల్లో చదువుకుంటున్నారని వెల్లడించారు. 8 దశాబ్దాలుగా ఎంతో మంది వ్యాపారవేత్తలను తయారు చేశారని తెలిపారు. ఎగ్జిబిషన్ సొసైటీలో దశాబ్ద కాలంగా ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు.