T20 : క్రికెట్ చరిత్రలో ఇటీవల ఎన్నడూ చూడని.. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల్లో కనీవినీ ఎరుగని ఘటన ఒకటి… T20 వరల్డ్ కప్ లో చోటు చేసుకుంది. బౌలర్, అంపైర్ల పొరపాటు కారణంగా ఒక ఓవర్లో ఆరు బంతులకు, ఐదు బంతులే పడ్డాయి. మ్యాచ్ లో ఆసీస్ మొదట బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జరిగిన ఈ పొరపాటును… తర్వాతి ఓవర్లో తొలి బంతి వేశాక గుర్తించారు. కానీ, అప్పుడు చేసేదేమీ లేక… మ్యాచ్ ను అలాగే కొనసాగించారు.
ఆసీస్ ఇన్నింగ్స్లో నాలుగో ఓవర్ను నవీన్ ఉల్ హక్ వేశాడు. ఆ సమయంలో క్రీజులో మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ ఉన్నారు. తొలి రెండు బంతులకు రెండు సింగిల్స్ వచ్చాయి. మూడో బంతిని మార్ష్ ఫోర్ కొట్టాడు. నాలుగో బంతికి పరుగులేమీ రాలేదు. ఐదో బంతికి 3 రన్స్ వచ్చాయి. ఓవర్ పూర్తైందనుకున్న నవీన్ ఉల్ హక్ అంపైర్ వద్దకి వచ్చాడు. అంపైర్ కూడా ఓవర్ పూర్తైందేమోనని పొరపాటు పడ్డాడు. మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ సహా ఆప్ఘన్ ఆటగాళ్లు కూడా ఐదు బంతులే పడ్డాయని గుర్తించలేకపోయారు. తర్వాతి ఓవర్ తొలి బంతి పడిన తర్వాత… జరిగిన పొరపాటును ఫీల్డ్ అంపైర్ గుర్తించాడు. కానీ… చేసేదేమీ లేక మిన్నకుండిపోయాడు. చివరికి ఆస్ట్రేలియా 20 ఓవర్లలో ఒక బంతి తక్కువగా ఆడినట్లయింది. దీనిపై అప్పుడే దుమారం మొదలైంది.
వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీల్లో… ఆఖరి బంతి దాకా ఉత్కంఠభరితంగా జరిగే మ్యాచ్ ల్లో… ఓవర్లో ఒక బంతి తక్కువ పడిన విషయాన్ని అంపైర్లు, బౌలర్లు, ఫీల్డర్లు, బ్యాటర్లు సహా… స్కోర్ కౌంట్ చేస్తున్న వాళ్లు కూడా చూసుకోకపోతే ఎలా? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఆసీస్ అదృష్టం బాగుండి ఆప్ఘనిస్తాన్ పై 4 పరుగుల తేడాతో గెలిచింది కాబట్టి సరిపోయిందని… అదే చివరి బంతికి ఆప్ఘన్ గెలిచి ఉంటే… అప్పుడు ఎవర్ని తప్పు పట్టి ఏం ప్రయోజనం అంటున్నారు. సాధారణంగా మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఫీల్డ్ అంపైర్లు ఓవర్ పూర్తయ్యే వరకు అన్ని బంతులను కౌంట్ చేయడంతో పాటు… పరుగులు, రనౌట్లు, లెగ్బైస్, నోబాల్స్ తో పాటు చాలా అంశాలను గమనించాల్సి ఉంటుంది. అప్పుడప్పుడూ కొన్ని విషయాల్లో పొరపాట్లు జరిగినా… ఇలా ఓవర్లో ఆరు బంతులకు బదులు ఐదు బంతులు పడిన ఘటనలు అరుదే.