Liquor Sales : నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా తెలంగాణలో మద్యం ఏరులై పారింది.సెలబ్రేషన్స్ పేరుతో విచ్చలవిడిగా మద్యం కొనుగోలు చేశారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ చేసుకున్నసంబరాలు ప్రభుత్వ ఖజానాను నింపాయి. తెలంగాణలో 2023 డిసెంబర్ 31న ఒక్కరోజే 313 కోట్ల రూపాయల లిక్కర్ అమ్ముడవ్వడం అందర్ని షాక్ కి గురి చేస్తుంది.
న్యూ ఇయర్ సందర్భంగా లిక్కర్ సేల్స్ జోరుగా సాగాయని తెలుస్తుంది. మూడు రోజుల్లో దాదాపు రూ.625 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. లిక్కర్ షాపులు, వైన్స్కి అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్లకు ఒంటి గంట వరకు అనుమతి ఉండడంతో మందుబాబులు పండగ చేసుకున్నారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 28న రూ.133 కోట్లు, 29న రూ.179 కోట్లు, 31న అత్యధికంగా రూ.313 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి.
ఇక అదే విధంగా కొత్త ఏడాది వేడుకల్లో మందుబాబులకు పోలీసులు ఝలక్ ఇచ్చారు. డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేపట్టిన పోలీసులు. రికార్డు స్థాయిలో చెకింగ్ లు నిర్వహించారు.ఈ మేరకు హైదరాబాద్లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 3 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయని పోలీసులు వెల్లడించారు.సైబరాబాద్ పరిధిలో 1241 కేసులు, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1200 కేసుల నమోదు అయినట్లు తెలిపారు.
కాగా 938 టూ వీలర్స్ పై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కేసులు రిజిస్టర్ చేశారు. పట్టుబడిన వారిలో 18 నుంచి 25 ఏళ్ల లోపు వారు 382 మంది, 26 నుంచి 35 ఏళ్ల లోపువారు 536 మంది ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. అలానే రోడ్లపై రాష్ డ్రైవింగ్ చేసిన వారిని సైతం సీసీ కెమెరాల ద్వారా గుర్తించామన్నారు. ఫ్లైఓవర్ లు మూసి వేయడంతో ప్రమాదాలు తగ్గాయని, డ్రగ్స్ డిటెక్టివ్ టెస్ట్ లు విజయవంతం అయ్యాయన్నారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అడ్డుకట్ట వేశామని ప్రశాంతంగా వేడుకలు జరిగాయని పోలీసులు వివరించారు.