Minister Vidadala Rajini: గుంటూరులో న్యూ ఇయర్ సంబరాల్లో కొందరు దుండగులు రెచ్చిపోయారు. చంద్రమౌళి నగర్లో ప్రారంభానికి సిద్ధమైన వైసీపీ ఆఫీస్ మీద దాడి చేశారు. రాళ్లు విసరడంతో.. అద్దాలు పగిలిపోయాయి. వెంటనే స్పందించిన పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.
గుంటూరు వెస్ట్ వైసీపీ ఇన్ఛార్జ్గా నియమితులైన మంత్రి విడదల రజని.. కొత్త ఏడాది సందర్భంగా చంద్రమౌళి నగర్లో వైసీపీ ఆఫీస్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అర్థరాత్రి న్యూ ఇయర్ సందర్భంగా ర్యాలీ తీసిన వారిలో కొందరు దుండగులు.. వైసీపీ ఆఫీస్పై రాళ్లు విసిరారు. బందోబస్తులో ఉన్న పోలీసులు అందరినీ చెదరగొట్టి, 50 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
కార్యాలయంపై జరిగిన దాడిపై మంత్రి విడదల రజిని స్పందించారు. సోమవారం ఉదయం పార్టీ ఆఫీసును పరిశీలించిన ఆమె.. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇది పక్కా ప్లాన్ తో జరిగిన దాడి అని, దీని వెనుక ఎవరున్నా వదిలేది లేదన్నారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో కొందరు ఈ దాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. ఇలాంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోవాలన్నారు. ఈ దాడి ఘటన వెనుక ఉన్నవారందరికీ గుణపాఠం చెబుతామన్నారు.
ఒక బీసీ మహిళా మంత్రిగా ఉన్న తన కార్యాలయంపైనే దాడి చేశారంటే.. వాళ్లకు బీసీలంటే ఎంత చిన్నచూపో అర్థమవుతుందన్నారు. పక్కప్రణాళికతో దాడి చేశారు కాబట్టే.. లాఠీఛార్జ్ చేసినా దాడిని కొనసాగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే మద్దారి గిరి మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ప్రారంభించడాన్ని ఎల్లో బ్యాచ్ జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఒకవైపు జయహో బీసీ అంటూనే.. మరోవైపు బీసీ మంత్రుల ఆఫీసులపై రాళ్లు రువ్వుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు చర్యలు తీసుకుని, నిందితుల్ని శిక్షించాలని కోరారు.
.
.