Munugodu Vote Counting : మునుగోడు ఓటింగ్ పూర్తయింది. ఆదివారం మధ్యాహ్నం కల్లా మునుగోడు ఫలితం వెలువడే అవకాశం ఉందని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. ఎప్పుడూ లేనంతగా పోలింగ్ శాతం నమోదైంది. 93.13 శాతం పోలింగ్ నమోదైంది. 2018తో పోలిస్తే.. ఇది అధిక పోలింగ్ రేటు. గురువారం అర్ధరాత్రి 1.30గంటల వరకు పోలింగ్ నడిచింది.
ఇక కౌంటింగ్.. ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. కౌంటింగ్కు 21 టేబుళ్లు ఏర్పాటు చేయనున్నారు. 298 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది. ఈ కేంద్రాల్లోని అన్ని ఈవీఎంలలోని ఓట్లను 15 రౌండ్లలో లెక్కిస్తారు. ఉదయం 9 గంటల తొలి రౌండ్ ఫ లితం.. మధ్యాహ్నం 1 గంటకల్లా గెలుపోటములు దాదాపు తేలిపోనున్నట్లు తెలుస్తోంది.
మునుగోడు ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓట్లను లెక్కించే సిబ్బందికి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలో భద్రపరిచి.. సీఆర్పీఎఫ్ జవాన్లను కాపలాగా ఉంచారు. చౌటుప్పల్ మండలంలోని ఓట్లను మొదటగా లెక్కించనున్నట్లు సంబంధిత అధికారులు చెప్పారు. మునుగోడు ఉపఎన్నికలో మొత్తం 2లక్షల 41 వేల 805 ఓట్లు ఉన్నాయి. వీటిలో 2లక్షల 25వేల 192 ఓట్లు పోల్ అయ్యాయి.