Uttar Pradesh : ఓ మహిళ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. వైద్యులు చికిత్స చేసి చనిపోయిందని చెప్పారు. ఆమెను అంబులెన్స్ లో స్వగ్రామానికి తరలిస్తుండగా మార్గంమధ్యలో లేచి కూర్చుంది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని హమీర్ పుర్ జిల్లాలో జరిగింది.
ఆ మహిళ భర్త తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హమీర్ పుర్ కు చెందిన మతాదిన్ రక్వార్ అనే వ్యక్తి భార్య అనిత కొన్నాళ్లుగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుంది. పెద్ద పెద్ద ఆసుపత్రులలో చూపించినా నయం కాలేదు. పదిహేను రోజుల క్రితం అనిత ఆరోగ్యం మరింత క్షీణించటంతో స్థానిక ఆసుపత్రిలో చేర్పించానని చెప్పాడు. రూ. 80 వేలకు పైగా ఖర్చు చేసినా తనకు నయం కాలేదన్నారు. చికిత్స చేసిన వైద్యులు తన భార్య చనిపోయిందని తెలిపారని అన్నాడు. మృతదేహానికి ఆసుపత్రి దగ్గరే అంత్యక్రియలు జరపమన్నారని.. కానీ తమ స్వగ్రామంలోనే చేయాలని అంబులెన్సలో ఇంటికి వెళ్తుండగా లేచి కూర్చుందని వెల్లడించాడు. తాగేందుకు నీళ్లు అడిగిన ఆమెను చూసి.. తనతో సహా అంబులెన్సులో ఉన్నవారంతా అవాక్కయారు అని మతాదిన్ వివరించాడు. ఇప్పుడు ఆమె ఆరోగ్యం బాగానే ఉందన్నారు.