24 in 2024: 2024.. ఎన్నో ఆశలు, ఆశయాలతో సరికొత్తగా కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. ఇంతకి కొత్త ఏడాదిలో ప్రపంచ వ్యాప్తంగా జరిగే పరిణామాలేంటి? అంటే చాలా జరగుతాయి. కానీ కొత్త ఏడాది ముఖ్యంగా 24 విషయాలు జరగనున్నాయి. అవేంటో చూద్దాం.
ఈ ఏడాది మన దేశంలో జరిగే మహత్తర కార్యక్రమం ఏదైనా ఉందంటే అది అయోధ్యలోని శ్రీరాముని భవ్య మందిర ప్రారంభోత్సవమనే చెప్పాలి. ఇప్పటికే దీనికి సంబంధించి అయోధ్యానగరి ముస్తాబవుతోంది. ఒకటి కాదు రెండు కాదు.. వేల సంవత్సరాల తర్వాత మళ్లీ అయోధ్యాపురిలో వెలుగులు కనిపిస్తున్నాయి. కమలంపై ఆసీనుడైన బాల రాముడి దివ్య రూపాన్ని జనవరి 22న మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల మధ్య ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ మహత్తర ఘట్టం జరగనుంది. 500 నదీజలాలతో పట్టాభిషిక్తుడైన ఏకైక రాజు శ్రీరాముడే అని చెప్పుకోవాలి. ఇప్పుడు కలియుగంలోనూ ఆ స్థాయికి తగ్గకుండా అయోధ్య ముస్తాబైంది. శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకూ అన్ని వైదిక పద్ధతుల్లో, ఉత్తర భారతీయ సంప్రదాయాలతో శ్రీరాముడి ఘనకీర్తి చాటేలా కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఈ ఏడాది జరగబోతున్న మరో మహత్తర ఘట్టం భారత్ న్యాయ్ యాత్ర. భారత్ జోడో యాత్ర పేరుతో ఇప్పటికే అడుగంటిపోయిందనుకన్న కాంగ్రెస్లో కొత్త జోష్ తీసుకొచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అదే జోష్లో ఈ సారి దేశ ప్రజలను ఏకం చేసేందుకు మరోసారి జనవరి 14 నుంచి మార్చి 20 వరకు యాత్ర నిర్వహించేందుకు రెడీ అయ్యారు. మణిపూర్ నుంచి ముంబయి వరకు 14 రాష్ట్రాలు 85 జిల్లాల మీదుగా మొత్తం 6 వేల 200 కిలోమీటర్ల మేర యాత్ర చేయనున్నారు రాహుల్. ఈ యాత్రలో మహిళలు, యువత, బలహీనవర్గాల ప్రజలను కలిసి మాట్లాడుతారు రాహుల్. దేశంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం కోసం రాహుల్ చేపట్టబోతున్న యాత్ర ఇది అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. అందుకే భారత్ న్యాయ యాత్రగా పేరు మార్చినట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. గతంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి ఘన స్వాగతం లభించగా.. ఈ యాత్ర కూడా అలాగే సాగుతుందని చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు.
రాహుల్ యాత్ర ముగిసే సమయానికి దేశంలో లోక్సభ ఎన్నికల సందడి మొదలు కానుంది. ఈ ఎన్నికల మహాసమరం భారతదేశం దశ, దిశను మార్చడం ఖాయమన్న చర్చ జరుగుతోంది. అందుకే 2024లో జరిగే అతి ముఖ్యమైన ఘట్టాల్లో ఇది కూడా ఒకటని కచ్చితంగా చెప్పుకోవాలి. ఇప్పటికే రెండు సార్లు గెలిచి తమ సత్తా చాటిన భారతీయ జనతా పార్టీ.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలన్న జోష్లో ఉంది. మరోవైపు ఈ సారి గెలిచి బీజేపీ జైత్రయాత్రకు బ్రేక్ వేయాలన్న ఆలోచనలో ఉన్నారు కాంగ్రెస్ నేతలు. 2024లో రాజకీయ నేతలు సరికొత్త సవాళ్లు ఎదుర్కోవడం పక్కాగా కనిపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఏడాది రాజకీయంగా ఓ కలకలం సృష్టించడం ఖాయమనే చెప్పాలి.
లోక్సభ ఎన్నికలతో పాటు కురుక్షేత్రాన్ని తలపించే మరో ఎన్నికల సమరానికి వేదిక కానుంది ఆంధ్రప్రదేశ్. ఓ వైపు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ.. మరోవైపు విపక్షాల కూటమి టీడీపీ, జనసేన.. గెలుపు మాదంటే మాదనే తరహాలో ఇప్పటికే కదనరంగంలో కత్తులు దూసుకుంటున్నాయి. మూడు విమర్శలు, ఆరు ఆరోపణలతో ఇప్పటికే పొలిటికల్ హీట్ పీక్స్కు చేరింది. వ్యూహ ప్రతివ్యూహాలతో ఇప్పటికే పార్టీల నేతలు సభలు, సమావేశాలు, నేతల మార్పులతో వేడిని పెంచేశారు. దేశం మొత్తం ఎన్నికలు ఒక ఎత్తైతే.. ఏపీ ఎన్నికలు మరో ఎత్తు అన్నట్టుగా పరిస్థితి ఉందంటే రాజకీయ రచ్చ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ కురుక్షేత సమరం కూడా 2024లోనే జరగనుంది.