Newyear Celebrations: 2024.. నూతన సంవత్సరం వచ్చేసింది. ప్రపంచమంతా గ్రాండ్గా వెల్కమ్ చెప్పేసింది. విద్యుద్దీపాలంకరణలు.. లేజర్ షోలు.. టపాసుల మోతలు.. కేక్ కటింగ్లు.. యువత కేరింతల నడుమ కొత్త సంవత్సరం ఘనంగా ప్రారంభమైంది. పలు ప్రపంచ దేశాలతో పాటు భారత్ వ్యాప్తంగా నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి. కొత్త ఆశలు, ఆశయాలతో ‘హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ యావత్ దేశం 2024కి ఘన స్వాగతం పలికింది. బాణసంచా వెలుగుల్లో పలు నగరాలు మిరుమిట్లుగొల్పాయి. ఢిల్లీ, హైదరాబాద్, ముంబయి, కోల్కతా, విశాఖ వంటి పలు మెట్రో పాలిటన్ నగరాలు విద్యుద్దీప కాంతుల్లో మెరిశాయి. 2023 వీడ్కోలు చెబుతూ.. గతేడాది ఎదుర్కొన్న సమస్యలు, వచ్చిన కష్టాలు.. నూతన ఏడాదిలో పునరావృతం కాకుండా ఉండాలని ఆకాంక్షిస్తూ.. 2024కు ఘన స్వాగతం పలికారు. సామాన్యుల నుంచి ప్రముఖుల దాకా పరస్పరం న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పుకొని సందడి చేశారు.
న్యూ ఇయర్ సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. ఇరు తెలుగు రాష్ట్రాలలో ప్రధాన ఆలయాలన్ని భక్తులతో సందడిగా మారాయి. ఇయర్ ఎండింగ్ రోజున ఎంజాయ్ చేసిన జనం.. ఇప్పుడు టెంపుల్స్ లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే ప్రముఖ పుణ్య క్షేత్రాలు అన్ని జనసందోహంతో రద్దీగా మారాయి. కొత్త సంవత్సరం సందర్భంగా భక్తులు ఇష్టదైవాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కొత్త ఏడాదిలో ఎలాంటి అడ్డంకులు లేకుండా గడపాలని ప్రార్ధిస్తున్నట్లు భక్తులు చెబుతున్నారు.
తిరుమలలో భక్తులు భారీగా పోటెత్తారు. శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తిరుమలకు భారీగా తరలివచ్చారు. దీంతో పాటు విజయవాడలోని దుర్గమ్మ సన్నిధికి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అలానే ఏలూరులోని ద్వారకా తిరుమలలో వెంకన్నను దర్శించుకునేందుకు భక్తులు భారీగా బారులు తీరారు. దీంతో ఆలయ ప్రాంతం, పరిసర ప్రాంతాలు గోవింద నామస్మరణలతో మారుమోగిపోతున్నాయి.
ఇక హైదరాబాద్ లోని మినీ తిరుపతి(టిటిడి ఆలయం)కి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి శ్రీవారిని దర్శించుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచి ఉత్తర ద్వార దర్శనంతో స్వామివారిని దర్శించుకుంటున్నారు. తెలంగాణలోని ప్రముఖ ఆలయాలైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, భద్రాద్రి రామాలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివస్తున్నారు