Arunachal Pradesh: అక్కడ చెప్పుకోదగ్గ పురాణ కాలపు కట్టడాలేమీ లేవు. సనాతన ధర్మపు ఆలయాలూ కానరావు. అయితే.. అక్కడ అడుగడుగునా బుద్ధుని పాదముద్రలు కనిపిస్తాయి. కనుచూపు మేర.. నిండా పరుచుకున్న పచ్చదనం, నీరెండకు మెరిసే హిమాలయ శిఖరాలతో ఆ ప్రాంతం పర్యాటకుల మనసును కట్టిపారేస్తుంది. భానుడి తొలి కిరణాలు భరత భూమిపై పడే ఆ ఆ ఈశాన్య సౌందర్యం పేరే… అరుణాచల్ ప్రదేశ్.
హిమాలయ పర్వత సానువుల్లో అందంగా ఒదిగిన ఈ సరిహద్దు రాష్ట్రానికి తూర్పున చైనా, బర్మా, పశ్చిమాన భూటాన్, దక్షిణాన అస్సాం, ఉత్తరాన చైనా సరిహద్దు దేశాలుగా వున్నాయి. అతి తక్కువ జనసాంద్రత గల ఈ రాష్ట్రం.. అనేక భాషలు మాట్లాడే గిరిజన తెగలకు ఆలవాలం. ఒకప్పుడు దీనిని రహస్య ప్రదేశంగా పేరొందిన ఈ ప్రాంతం నేడు దేశపు ప్రధాన జీవన స్రవంతితో ఇప్పుడిప్పుడే కలుస్తోంది.
మంగోలియా, టిబెట్, బర్మాల నుంచి ఏనాడో వలస వచ్చిన పలు తెగలకు ఈ రాష్ట్రం ప్రధాన స్థావరం. మెజారిటీ ప్రజలు బౌద్ధాన్ని అవలంబిస్తారు. ఇక్కడి ప్రజలు అనాదిగా ఇతర ప్రాంతాల వారితో కుటుంబ సంబంధాలు, సాంస్కృతిక సంబంధాలకు దూరంగా ఉండిపోయారు. స్థానికంగా చూడదగిన ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా.. యాత్రికులు టాక్సీలను ఆశ్రయించాల్సిందే. క్రీస్తు పూర్వం నాటికే ఇక్కడ గొప్ప సంస్కృతి ఉందని తెలిపే కొన్ని శాసనాలు మినహా.. క్రమబద్ధమైన చారిత్రక రికార్డులేమీ అందుబాటులో లేవు.
చూడవలసిన ప్రదేశాలు..
అరుణాచల్ ప్రదేశ్లో చూడదగిన వాటిలో మొదటిది.. తవాంగ్. రాష్ట్రపు వాయువ్యమూలన ఉన్న ఈ చిన్న పట్టణానికి.. ఒకవైపు చైనా, మరోవైపు భూటాన్ సరిహద్దులుంటాయి. శీతాకాలమంతా ఈ పట్టణం మంచుతో కప్పబడే ఈ పట్టణం.. వేసవిలో ఆకుపచ్చగా మారుతుంది. హిమాలయాల నుంచి వచ్చే హిమానీనదాలు హఠాత్తుగా ప్రవహించి, అంతలోనే ఆగిపోతుంటాయి. 1962లో భారత, చైనా యుద్ధం జరిగిన ప్రధాన ప్రాంతం ఇదే. ఈ తవాంగ్ పట్టణం నుంచే 1962లో టిబెటన్ల గురువు దలైలామా మారువేషంలో తన అనుచరులతో కలిసి కంచర గాడిదల మీద ఎక్కి రహస్యంగా మనదేశానికి ప్రవాసం వచ్చారు.
17వ శతాబ్ధంలో ఇక్కడ బౌద్ధమత సాధువుల్లో వచ్చిన స్పర్ధల కారణంగా మేరాలామా అనే బౌద్ధ సన్యాసి 1681లో తన గులుక్పా వర్గపు సన్యాసులను రక్షించుకునేందుకు ఒక కోటను నిర్మించారు. అదే..నేటి తవాంగ్ చైత్యం. దీనిలో 500 మంది బౌద్ధ సాధువులున్నారు. ఇందులోని బంగారు బుద్ధ విగ్రహం, నాటి వ్రాతప్రతులు, బంగారు సిరాతో రాసిన పుస్తకాలు చూసితీరాల్సిందే. దేశంలోని అతిపెద్ద బౌద్ధ చైత్యాలన్నింటిలో ఇదే పెద్దది. భద్రతా కారణాలతో గతంలో కేవలం విదేశీ పర్యాటకులకు మాత్రమే అనుమతి ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు అందరూ వెళ్లొచ్చు. ఇక్కడికి హెలికాప్టర్ సేవలూ అందుబాటులో ఉన్నాయి.
తవాంగ్ తర్వాత ఇక్కడ చూడదగిన మరో పట్టణం.. ఈటానగర్(ఐతానగర్). ఇది అరుణాచలప్రదేశ్కు రాజధాని. దీనికి గొప్ప చరిత్ర ఉంది. 14, 15 శతాబ్దాల్లో దీనిని మాయాపూర్ అని పిలిచేవారు. ఇక్కడి కోట, బుద్ధిస్ట్ చైత్యం, జవహర్లాల్ మెమోరియల్ మ్యూజియం, జూ, క్రాఫ్ట్ సెంటర్ చూడదగినవి. పోలో, బోటింగ్, ట్రెక్కింగ్ ప్రియులు తప్పక వెళ్లాల్సిన ప్రదేశమిది.
యుద్ధాన్ని తలపించే ఇక్కడి ప్రజలు నృత్యాలు, అద్భుతమైన ప్రకృతి పచ్చదనం, ప్రజల ప్రశాంత జీవనశైలి, బౌద్ధారామాల ఆధ్యాత్మికత పర్యాటకులను కట్టిపారేస్తాయి. ఇక్కడ ప్రజలు తమ అతిథులతో ఎంతో మర్యాదగా వ్యవహరిస్తారు. ముందుగా అతిథులకు బట్టర్, టీ ఇచ్చి ఆహ్వానించి, తరువాత క్షేమ సమాచారాలు అడుగుతుంటారు. అరుణాచల ప్రదేశ్ వెళ్లాలంటే.. అస్సాం గుండానే వెళ్ళాలి. అస్సాంలోని గౌహతి, తేజ్పూర్, డిబ్రూఘర్ విమానాశ్రయాల్లో దిగి.. అక్కడి నుంచి వెళ్లాల్సి ఉంటుంది. రైలులో వెళ్లేవారు రంగ్పారలఖింపూర్ నార్త్, డ్రిబూఘర్, ధిమ్స్కియా, నహర్క్టియా స్టేషన్లలో దిగి వెళ్లొచ్చు.