Tragic Deaths of Conquerors | ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఎదురులేని పరాక్రమవంతులుగా నిలిచిన టాప్ నలుగురిలో అలెగ్జాండర్ ది గ్రేట్, జూలియస్ సీజర్, చెంగీజ్ ఖాన్, నెపోలియన్ బోనపార్ట్ ఉన్నారు. వీరంతా అతిభీకర యుద్ధాలు చేసి అద్భుత విజయాలు సాధించినవారు. సువిశాల సామ్రాజ్యాలు స్థాపించారు. కానీ ఎన్ని విజయాలు సాధిస్తే ఏం లాభం.. ప్రశాంతమైన మరణానికి మాత్రం వీరు నోచుకోలేదు.
అలెగ్జాండర్ ది గ్రేట్
అతి తక్కువ వయసులో రాజ్యాన్ని వదిలిపెట్టి ప్రపంచాన్ని జయించాలని తన సైన్యంతో బయలుదేరిన అలెగ్జాండర్.. సుమారు పదేళ్ల పాటు యుద్దాలు చేస్తూ చేస్తూ అలసిపోకుండా ఇండియా వరకు వచ్చాడు. ప్రతి యుద్ధంలో అతని సైన్యం విజయం సాధిస్తూ వచ్చింది. ఈజిప్టు, పర్షియా(ఇరాన్, సిరియా, లెబనాన్) లాంటి రాజ్యాలను తన కాళ్ల వద్దకు తెచ్చుకున్నాడు. కానీ ఇండియా సరిహద్దుల వద్దకు చేరుకునే సరికి అతడి సైన్యం విశ్రాంతి కోరుకున్నది. ఇక చేసిన యుద్ధాలు చాలు అలసిపోయామని.. ఇంటికి తిరిగి వెళదామని సైనికులు, సేనా నాయకులు.. అలెగ్జాండర్ మహారాజుకు తెలిపారు.
కానీ అలెగ్జాండర్ విజయ దాహం తీరలేదు. అతను ఇండియా జయించే తిరిగివెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం భారత దేశంలో ముందుగా చిన్న చిన్న రాజ్యాలు అతడికి భయపడి తలవంచాయి. కానీ పంజాబ్ చక్రవర్తి పోరస్(పరమానంద్) అతనితో యుద్ధం చేశాడు. ఈ యుద్ధంలో అలెగ్జాండర్ తన సైనికులలో మళ్లీ ధైర్యం నింపడానికి ముందు వరుసలో ఉండి పోరాడాడు. ఈ కారణంగా తీవ్రంగా గాయపడ్డాడు, అతని గుర్రం చనిపోయింది. యుద్ధం గెలిచిన తరువాత గాయపడిన అలెగ్జాండర్ తన రాజ్యం మెసిడోనియాకు తిరిగి పయనించాడు. దారిలో తాను జయించిన పర్షియా రాజ్యంలో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకునేందుకు బసచేశాడు. ఆ సమయంలో పర్షియా రాజ్యంలో తన ప్రతినిధిగా ఉన్న అతని ఆప్తమిత్రుడు చనిపోయాడని తెలిసి మానసికంగా కుమిలిపోయాడు. మద్యం అతిగా సేవించేవాడు. ఈ కారణంగా అతనికి పక్షవాతం సోకిందని చరిత్రకారులు చెబుతారు. క్రమంగా అతని ఆరోగ్యం క్షీణించి మరిణించాడు. కానీ మరికొందరు మాత్రం అతను చనిపోలేదు కోమాలో ఉండగా.. అతడిని సజీవ సమాధి చేశారని చెబుతారు.
చనిపోయేముందు అతడి సైన్యంలోని ప్రముఖలు అతడి గదిలోకి వెళ్లి ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా అడిగారు. తన తరువాత ఎవరు రాజుగా ఉండాలో చెప్పాలని ప్రశ్నించారు. దానికి సమాధానంగా.. మీలో అత్యంత శక్తిమంతుడు మాత్రమే నా రాజ్యాన్ని పరిపాలించాలి అని అలెగ్జాండర్ చెప్పాడు. ఈ మాటతో తమ బలాబలాలు తేల్చుకోవాలని వారంతా 15 ఏళ్ల పాటు వారిలో వారే కొట్టుకుచచ్చారు. దీంతో మెసిడోనియా రాజ్యం నాశనమైపోయింది. మెసిడోనియా కేంద్రంగా ప్రపంచాన్నే శాసించాలని కలలుకన్న అలెగ్జాండర్ రాజ్యం చివరికి అలా తన అస్తత్వం కోల్పోయింది.
జూలియస్ సీజర్
అలెగ్జాండర్ని తన ఆదర్శంగా భావించే జూలియస్ సీజర్ ఎప్పుడూ అలెగ్జాండర్లా తను కూడా ప్రపంచాన్ని జయించాలనుకుంటున్నాడని తన మిత్రులతో చెప్పేవాడు. కానీ అలెగ్జాండర్ లాగా అతి చిన్న వయసులోనే గొప్ప గొప్ప విజయాలను తాను సాధించకలేకపోయానని బాధపడేవాడు. అందుకోసమే సీజర్ కూడా అలెగ్జాండర్ లాగే స్వార్థంగా ఆలోచించేవాడు. తన పేరు ప్రపంచమంతా మార్మోగిపోవాలనుకునేవాడు. క్రమంగా ఎన్నో యుద్ధాలు గెలిచి అతిపెద్ద రోమన్ సామ్రాజ్యానికి సర్వసేనాధ్యక్షుడి స్థాయికి చేరుకున్నాడు. ఆ తరువాత ఒకరోజు రోమన్ సామ్రాజ్యానికే తనని తాను నియంతగా, మహారాజుగా, చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు.
”చట్టాన్ని ఎప్పుడూ గౌరవించాలి.. కానీ సమయం వచ్చినప్పుడు అధికారం చేజిక్కించుకునేందుకైతే ఏ చట్టాన్ని గౌరవించాల్సిన అవసరం లేదు” అని చెప్పేవాడు. సీజర్ నియంత పాలనలో అతని మంత్రులు, సహచరులు అసంతృప్తిగా ఉండేవారు. అందుకోసమే ఒకరోజు 44 మంత్రులు(సెనేటర్లు).. సెనేట్ మీటింగ్ కోసమని సీజర్ని పిలిచి 23 సార్లు కత్తితో పొడిచి పొడిచి చంపారు. చనిపోయే ముందు సీజర్ నమ్మలేని ఒక నిజం చూశాడు. ఆ హంతకులలో తన పెంచి పోషించిన కొడుకు మార్కస్ బ్రూటస్ ఉండడం. చనిపోతూ ‘మార్కస్ నువ్వుకూడా నా’ అని ఆశ్చర్యపోతూ మరణించాడు.
సీజర్ మరణించాక రోమన్ సామ్రాజ్యంలో అంతర్యుద్ధాలు జరిగాయి. ప్రధాన నగరాలన్నీ వల్లకాడులా మారిపోయాయి. ఆ తరువాత రోమ్ దేశం.. రోమన్ రిపబ్లిక్గా అవతరించింది.
చెంగీజ్ ఖాన్
క్రైస్తవ క్రూసేడర్లు, ఇస్లామిక్ జిహాదీల యుద్ధాల కాలం ముగిసే సమయంలో ఒక్కసారిగా చైనా పక్క దేశం మంగోలియా అడవుల నుంచి ప్రపంచాన్ని ఆక్రమించుకోవాలని బయలుదేరాడు చెంగీజ్ ఖాన్. కటిక పేదరికం అనుభవించిన చెంగీస్ ఖాన్ తన స్నేహితులతో కలిసి తన జాతి తండాలపైనే యుద్ధం ప్రకటించాడు. అలా వాటిని జయించాక.. మంగోల్ యువకులకు సైనిక శిక్షణ ఇచ్చి ఆటవిక తండా వాసులకు యుద్ధంలో క్రమశిక్షణ అంటే ఏంటో నేర్పించాడు. తన ఆజ్ఞలను శిరసావహించే సైన్యాన్ని అలా నిర్మించుకున్న చెంగీజ్ తొలిగా అతిపెద్ద చైనా సామ్రాజ్యంపై దాడి చేశాడు. అతి క్రూరంగా చైనా సైన్యాన్ని చీల్చి చెండాడి.. భయం అంటే ఏంటో వారికి పరిచయం చేశాడు. ఆ తరువాత యూరప్ దేశాల వరకూ తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అలెగ్జాండర్ ఆక్రమించుకున్న భూభాగం కంటే రెండింతల భూమి చెంగీజ్ ఖాన్ రాజ్యంలో ఉండేది.
”నిన్ను చూస్తేనే శత్రువు భయంతో పారిపోవాలి. అతడి సైన్యం చెల్లా చెదురు అయిపోవాలి. లేదా మోకాలి దండ వేసి తల వంచాలి. శత్రువు రాజ్యం మంటల్లో బూడిద కావాలి. అతని దుస్థితి చూసి అతని ప్రజలు కన్నీరు పెట్టాలి. శత్రువు భార్యలు, కూతుర్లు నీ చెంతకు చేరాలి. అప్పుడే ఒక మంగోలియన్కు నిజమైన సంతోషం” అని చెంగీజ్ ఖాన్ చెప్పేవాడు.
చెంగీజ్ ఖాన్ చావు ఒక రహస్యంగా ఉంచబడింది. కారణం అతను ఎలా మరణించాడో ఎవరికీ తెలియకూడదని చెంగీజ్ ఖాన్ చనిపోతూ ఆజ్ఞాపించాడు. కానీ చరిత్రకారుడు రషీద్ ఉల్ దీన్ వ్యాఖ్యానం ప్రకారం.. ప్లేగు కారణంగా చెంగీజ్ ఖాన్ శరీరం నిండా బొబ్బలు వచ్చాయి. మర్మాంగలలో ఎక్కువ నొప్పితో అతను బాధపడేవాడు. మరో చరిత్రకారుడు మార్కోపోలో ప్రకారం ఒక యుద్ధంలో అతను ఒక బాణం వేటుకు తీవ్రంగా గాయపడి.. క్రమంగా అస్వస్థతతో చనిపోయాడు. మరో ప్రచారం ఏమిటంటే చెంగీజ్ ఖాన్ ఒక చైనా రాజకుమారిని ఖైదు చేసి అనుభవించేవాడు. ఆ రాజకుమారి ఒకరోజు కత్తితో చెంగీజ్ ఖాన్ మర్మాంగాలను కోసేసింది. ఫలితంగా చెంగీజ్ ఖాన్ తీవ్ర రక్తస్రావంతో చనిపోయాడు. కానీ చనిపోయేముందు అతను చివరికోరికగా.. తన మృతదేహాన్ని ఎక్కడ పూడ్చిపెట్టారు. తాను ఎలా మరణించానో రహస్యంగా ఉండాలని ఆదేశించాడు. దీనికోసం చెంగీజ్ ఖాన్ శవాన్ని తీసుకెళ్లే సమయంలో అతడి అనుచరులు దారిలో వచ్చే బస్తీలను తగల బెట్టారు. ఈ కారణంగా అతడి శవయాత్ర ఎవరూ చూడలేదు. అతడి సమాధి ఎక్కడుందో కచ్చితంగా ఎవరికీ తెలియదు. కానీ ఎక్కడో ఖెంటై పర్వతాలలో ఉందని చరిత్రకారులు చెబుతారు.
నెపోలియన్ బోనపార్ట్
బ్రిటీష్ పాలకులకు 19వ శతాబ్దంలో ఎదురు నిలిచిన ఫ్రాన్స్ యోధుడు నెపోలియన్ బోనపార్ట్. ఫ్రాన్స్ దేశానికి బలమైన సైన్యం, నౌకా దళం ఏర్పాటు చేసిన ఘనత అతనిది. శత్రు దేశాలను జయించినా వాటిని నాశనం చేయకూడదని భావించేవాడు. శత్రు దేశాల చరిత్ర, సంస్కృతి, వైద్య విధానాలతో లాభం పొందాలనే గొప్ప భావాలు కలిగినవాడు.
తక్కువ సైన్యంతో కూడా ఫ్రాన్స్ కోసం అద్భుత విజయాలు సాధించాడు నెపోలియన్. అందుకే అతడిని అందరూ మిలిటరీ జీనియస్ అంటారు. ”యుద్ధ రంగం నాకో పెయింటింగ్ లాంటిది నేను దానిని అందంగా చిత్రీకరించే కళాకారుడిని” అని చెప్పుకునేవాడు. యుద్ధ భూమిలో ప్రతీ విషయాన్ని సూక్ష్మంగా పరిశీలించేవాడు. ఫ్రెంచు విప్లవాన్ని ఆసరాగా చేసుకొని తనకున్న ప్రజాభిమాన సహాయంతో ఫ్రాన్స్ దేశానికి తనని తాను రాజుగా ప్రకటించుకున్నాడు.
నిరంతరం యుద్ధాలు చేస్తూ బ్రిటీష్ వాళ్ల ఆధిపత్యాన్ని సవాల్ చేశాడు. కానీ 1815లో వాటర్ లూ యుద్ధంలో ఓడిపోయాడు. అతడిని బ్రిటీష్ పాలకులు చంపకూడదని నిర్ణయించారు. చంపితే అమరవీరుడిగా ఉండిపోతాడని భావించి అతడిని జీవిత కాలం ఖైదు చేశారు. అయినా నెపోలియన్ జైలు నుంచి పారిపోయి మళ్లీ తన రాజ్యానికి చేరుకొని.. చనిపోతే యుద్ధభూమిలోనే చనిపోతానని సైన్యం కూడగట్టి మరోసారి యుద్ధం చేశాడు. మళ్లీ ఓడిపోయాడు.
ఈ సారి శత్రువులు అతడిని ఒక గ్రామంలోని పాడుబడ్డ బంగళాలో బంధించారు. ఆ గ్రామాన్నే నిర్భంధించారు. ఆ బంగళాలో ఏళ్ల తరబడి ఒంటరిగా ఉంటూ చనిపోయాడు. కొందరు చరిత్రకారులు నెపోలియన్ ఖైదులో ఉండగా అతనికి క్యాన్సర్ సోకిందని.. ఆ కారణంగానే అతను మరణించాడని చెబుతారు.
అలా చరిత్రలోని నలుగురు అతి పరాక్రమవంతులకు ప్రశాంత మరణం లభించలేదు.
Tragic Deaths of Conquerors, Alexander the Great, Julius Caesar, Genghis Khan, Napolean Bonaparte, Tragic Death,