Indian Household Savings : 2023లో భారత ఆర్థిక వ్యవస్థ బాగానే పుంజుకుంది. కానీ.. దాని ఫలితాలు సానుకూలమైన రీతిలో పౌరులకు చేరలేదని తాజా గణాంకాలను బట్టి తెలుస్తోంది. కొవిడ్ సమయంలో కేవలం అవసరాలకే డబ్బు వెచ్చించటంతో భారీగా పెరిగిన పొదుపు మొత్తాలు.. కొవిడ్ భయం తొలగిపోగానే.. అంతే వేగంగా ఆ పొదుపు మొత్తాలు హరించుకుపోయాయి.
2022-23లో కుటుంబాల పొదుపు గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి పడిపోవటమే ఇందుకు ఉదాహరణ. కొవిడ్కు ముందు జీడీపీలో 11.6 శాతంగా ఉన్న పౌరుల పొదుపు వాటా 5.1 శాతానికి పడిపోయింది. 2023లో పౌరుల వ్యక్తిగత పొదుపు తగ్గిపోవటమే గాక.. సగటు కుటుంబ రుణభారం పెరిగింది. బ్యాంకులిచ్చిన వ్యక్తిగత, విద్య, వాహన రుణాలను వస్తువుల కొనుగోళ్లకు, స్థిరాస్తుల కొనుగోళ్లకు మళ్లించారు. మొత్తంగా చూస్తే.. రుణాల దుర్వినియోగం జరగలేదు గానీ.. మరింత అర్థవంతంగా వాడుకోలేదని మాత్రం తెలుస్తోంది.
గతంలో అవసరాలకు పోను మిగిలిన సొమ్మును చిన్న చిన్న ఫిక్స్డ్ డిపాజిట్లు చేయటమో, కొద్దీ గొప్పా బంగారం కొనటమో చేసేవారు. కానీ.. బ్యాంకులిచ్చే వడ్డీ రేటు తగ్గిపోవటంతో ఇప్పుడు బ్యాంకు రుణాలు తీసుకుని ఇల్లు, కారు, ఇతర విలాస వస్తువులు కొనేస్తున్నారు. అటు.. రుణాలు తీసుకునే వారి సంఖ్య పెరగటంతో బ్యాంకులూ తమ వ్యాపారాన్ని పెంచుకోవటానికి కాస్త ఉదారంగానే రుణాలిస్తున్నాయి. వాటి రుణ పరిమితి కూడా బాగానే పెరిగింది.
మొత్తంగా చూస్తే.. దేశంలో కుటుంబాల నికర ఆర్థిక పొదుపు 2022 – 23 ఆర్థిక సంవత్సరంలో 55 శాతం తగ్గిపోగా, అంతకు ముందు ఏడాదితో పోల్చితే కుటుంబాల రుణ భారం రెండింతలు పెరిగి రూ.15.6 లక్షల కోట్లకు చేరింది. ఇదే ధోరణి భవిష్యత్తులో కొనసాగితే.. సాధించిన ఆర్థిక ప్రగతి హారతి కర్పూరం కావటానికి ఎంతో సమయం పట్టదని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.