Rohit Sharma: ఆటలో గెలుపు ఓటములు సహజం. ఆరోజు బాగా ఆడిన టీమ్ గెలుస్తుంది. అంతే తప్ప, ఓడినవాళ్లు చాతకాని వాళ్లు కాదని రోహిత్ శర్మ ఘాటుగా స్పందించాడు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ లో ఘోర పరాజయం నేపథ్యంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎప్పుడూ కూల్ గా ఉండే రోహిత్ శర్మ ఈసారి అందుకు భిన్నంగా స్పందించాడు. విమర్శించేవారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
తమకు విదేశాల్లో ఎలా ఆడాలో తెలుసునని అన్నాడు. గతంలో విదేశాల్లో గెలిచిన మ్యాచ్ లను విమర్శించేవాళ్లు ఒకసారి గుర్తు పెట్టుకోవాలని అన్నాడు. ఆట అన్నాక.. ప్రతిసారి అద్బుతాలు జరగవని అన్నాడు. ఒకొక్కసారి ఇలాంటివి జరుగుతుంటాయి. అంతమాత్రం చేత టీమ్ ఇండియాలో ప్లేయర్లకి ఆడటమే చేతకాదని అనడం కరెక్ట్ కాదని అన్నాడు. టెస్ట్ జట్టులో ఉన్నవారందరూ ఇంతకాలం అద్భుత ప్రదర్శన చేసినవారేనని అన్నాడు.
విదేశీ పిచ్ లపై టీమ్ ఇండియా బ్యాటర్లు తేలిపోతున్నారనే విమర్శలను రోహిత్ శర్మ తేలిగ్గా కొట్టి పారేశాడు. మేం గతంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాలలో వారినే ఓడించాం. సిరీస్ లను గెలిచాం. ఆ సంగతి మరిచిపోకూడదని అన్నాడు. ఒకొక్కసారి ప్రతికూల ఫలితాలు ఎదురవుతుంటాయని అన్నాడు. సౌతాఫ్రికా బ్యాటర్లు 110 ఓవర్లు బ్యాటింగ్ చేశారు. మనం అంతసేపు ఆడలేకపోయామని అన్నాడు. టీమ్ ఇండియాలో కేఎల్ రాహుల్, కొహ్లీ మాత్రమే రాణించారు. మరో ఇద్దరూ రాణించి ఉంటే, ఫలితం మరోలా ఉండేదని అన్నాడు. ఆ మ్యాజిక్ జరగలేదన్నాడు.
గత నాలుగు సిరీస్ ల్లో టీమ్ ఇండియా ఎలా ఆడిందో తెలుసుకోవాలని అన్నాడు. రోహిత్ శర్మ స్పందించడంపై సీనియర్లు మాట్లాడుతూ.. క్రికెటర్లు ఎప్పుడూ మాటలతో కాదు, బ్యాట్ తో సమాధానం చెప్పాలని అన్నారు. సెంచరీలతో నోళ్లు మూయించాలని సూచించారు.
ఇకపోతే రెండో టెస్ట్ జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భారత్ తప్పనిసరిగా గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. లేదంటే ఎప్పటిలా ఉత్త చేతులతో ఇండియా తిరిగి వస్తుంది.
ఇక గెలిచినా, ఓడినా సిరీస్ విజయం దక్కదు కాబట్టి.. భారత అభిమానులు మాత్రం చరిత్ర తిరగరాసే వారికోసం మళ్లీ ఎదురుచూడక తప్పని పరిస్థితి మళ్లీ పునరావృతమైంది.