Ayodhya: అయోధ్యానగరి ముస్తాబవుతోంది. శ్రీరామ పట్టాభిషేకానికి సిద్ధమవుతోంది. ఒకటి కాదు రెండు కాదు.. వేల సంవత్సరాల తర్వాత మళ్లీ అయోధ్యాపురిలో వెలుగులు కనిపిస్తున్నాయి. శ్రీరామ జన్మభూమి పులకించిపోతోంది. శ్రీరామ రాజ్యం రారమ్మంటోంది. ధర్మం నాలుగు పాదాలూ నడిచిన నేలలో విల్లంబులు చేత ధరించి, కమలంపై ఆసీనుడైన బాల రాముడి దివ్య రూపం దర్శించుకునేందుకు భక్తజనకోటి వేయి కళ్లతో ఎదురుచూస్తోంది.
ఎప్పటి త్రేతాయుగం.. ఎప్పటి కలియుగం..
శ్రీరామ దర్శనం కోసం యుగాల నిరీక్షణకు తెరపడిన అత్యద్భుత సందర్భమిది. సత్యం, దయ, తపస్సులు లోపించి కాస్తంత దానగుణం పైనే నడుస్తున్న ఈ కలియుగంలో అదీ శ్రీరామ జన్మభూమిలో.. రాముడి దివ్య భవ్య మంగళ సుమనోహర రూపం కన్నుల ముందు సాక్షాత్కరించే అద్భుత ఘడియలు వచ్చేశాయి. షట్ గ్రహాలు సానుకూలమై, అరుదైన గ్రహ కూటమి కడుతున్న వేళ.. దైవత్వం ఉట్టి పడే సాలగ్రామ శిలపై.. కలియుగంలో మానవ మాత్రులకు అభయహస్తం అందించేందుకు శ్రీరాముడు దివి నుంచి భువికి వస్తున్న వేళ.. ప్రాణ ప్రతిష్ఠకు సిద్ధమవుతున్న ఆ అపురూప క్షణాలు వర్ణనాతీతం. ప్రతి హైందవుడి జీవితం ధన్యమయ్యే సందర్భం.
మర్యాద.. ధర్మం.. సంస్కృతి.. ఇదే అయోధ్య. ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా అయోధ్య రాముడి నామ స్మరణే.. హైందవులు కలలుగన్న భవ్యమైన, దివ్యమైన రామమందిర ప్రాణ ప్రతిష్టకు మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. అందుకే మర్యాద పురుషోత్తమున్ని దర్శించుకునేందుకు భక్తజనం ఆరాట పడుతోంది.
బిందువు, బిందువు కలిసి సింధువైనట్లు..
అయోధ్యలో రామ మందిరం యుగాల కల. అదిప్పుడు నెరవేరే మహత్తరమైన సందర్భం. యుగ పురుషుడు నడయాడిన నేలలో ఆ మహానుభావుడి దివ్య దర్శనం ఎప్పుడెప్పుడా అని భక్తజన కోటి ఎదురుచూస్తోంది. మానవుల జీవితానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన అవతారం శ్రీరామావతారం. మనుష్య జీవితంతో మమేకమైన అవతారం ఇది. మానవుడిగా పుట్టాడు.. మానవుడిగా పెరిగాడు, మనిషి పడ్డ కష్టాలు పడ్డాడు.. మానవుడిగానే అవతారం పరిసమాప్తి చేశాడు.. పరిపూర్ణమైన మానవ అవతారమే రామావతారం. అందుకే మానవ మాత్రులకు ఇదొక అపురూప సందర్భం.
అయోధ్యలో శ్రీరామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా అందరూ అర్థం చేసుకోవాల్సింది శ్రీరామ తత్వం. అదే ముఖ్యం కూడా. శ్రీరాముడు సత్యంతో లోకాలను, ధర్మంతో సమస్తాన్ని, సేవలతో గురువులను, దాన గుణంతో ఆపన్నులను గెలిచాడు. అలాగే తన శౌర్య పరాక్రమంతో శత్రువులను గెలిచాడు. షోడశ మహా గుణములు కలిగిన వాడే పరిపూర్ణమైన మానవుడని, అది శ్రీరామ చంద్రుడే అన్నది వాల్మీకి ఉవాచ. మానవుల అంతఃకరణలను బట్టియే యుగాలు మారుతాయి గానీ.. యుగమునుబట్టి మానవుల అంతఃకరణములు మారవన్నది ప్రతీతి. ఎందుకంటే కలియుగంలో ఉన్నా త్రేతాయుగం నాటి గుణాలు పాటిస్తే అదే త్రేతాయుగం. ప్రజలు పాటించాల్సింది కూడా ఇదే అన్నది అందరూ అర్థం చేసుకోవాల్సిన తత్వం. రామ రాజ్యం అని యుగాలు దాటినా చెప్పుకున్నారంటే అంతటి మహత్తరమైన పాలన సాగింది. రామ రాజ్యంలో అపమృత్యు భయంలేదు. విష పురుగుల వల్ల మరణం ఎవరికీ రాలేదు. ప్రజలంతా ఆనందంగా, సుఖంగా జీవించారు. పేదరికం, భయం లేని జీవితాన్ని గడిపారు. అందుకే అది రామరాజ్యమైంది. నేటికీ అదో రోల్ మోడల్.
500 నదీజలాలతో పట్టాభిషిక్తుడైన ఏకైక రాజు శ్రీరాముడే. ఇప్పుడు కలియుగంలోనూ ఆ స్థాయికి తగ్గకుండా అయోధ్య ముస్తాబైంది. శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకూ అన్ని వైదిక పద్ధతుల్లో, ఉత్తర భారతీయ సంప్రదాయాలతో శ్రీరాముడి ఘనకీర్తి చాటేలా కార్యక్రమాలు జరుగుతున్నాయి.
.
.